టీమిండియా స్టార్ ఓపెనర్, సన్రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 19 బంతుల్లోపు 7 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ తరఫున 18 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.
ఐపీఎల్ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్లో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 50 పరుగులు చేసి లింబానీ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. గత ఆదివారం బరోడాతో జింఖాన మైదానంలో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ భారీ శతకంతో చెలరేగాడు. 52 బంతుల్లో 148 పరుగులు చేశాడు. అదే జోరును తాజా మ్యాచ్లోనూ చూపించాడు.
టీ20ల్లో అభిషేక్ శర్మకు 19 బంతుల్లోపు ఇది ఏడో హాఫ్ సెంచరీ. అయితే ఇందులో మూడు హాఫ్ సెంచరీ పంజాబ్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపీలోనే నమోదు కాగా.. మరో మూడు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున వచ్చాయి. భారత్ తరఫున ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఏడు హాఫ్ సెంచరీలు కూడా 2024 తర్వాతే నమోదు కావడం గమనార్హం.

ఈ ఏడు హాఫ్ సెంచరీలను అభిషేక్ శర్మ 12, 14, 16, 17, 19 బంతుల్లో సాధించాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ.. కీరన్ పోలార్డ్ ఆల్టైమ్ రికార్డ్ను అధిగమించాడు. కీరన్ పొలార్డ్ 14, 17, 17, 18, 19, 19 బంతుల్లో 6 హాఫ్ సెంచరీలు నమోదు చేయగా.. ట్రావిస్ హెడ్ 16, 16, 17, 18, 19 బంతుల్లో 5 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.
ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా విధ్వంసంతో బరోడా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అభిషేక్ శర్మకు తోడుగా అన్మోల్ప్రీత్ సింగ్(32 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 69) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 8 వికెట్లకు 222 పరుగులు చేసింది. అనంతరం బరోడా 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 224 పరుగులు చేసి గెలుపొందింది. హార్దిక్ పాండ్యా(42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 77 నాటౌట్), శివాలిక్ శర్మ(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 47 నాటౌట్) పరుగులతో రాణించాడు.