తన గురువు, టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బ్రేక్ చేయడం అసాధ్యమని విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ అంగీకరించాడు. న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్ను 3-0తో మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా అర్థ శతకం బాదిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 68 పరుగులతో అజేయంగా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన అభిషేక్ శర్మ యువీ రికార్డ్ను బ్రేక్ చేయడం అంత ఈజీ కాదన్నాడు. 'నా జట్టు నా నుంచి ఆశిస్తున్నది విధ్వంసకర బ్యాటింగే. ప్రతీసారి ఇలా ఆడటం అంత సులువు కాదు. యువరాజ్ సింగ్ 12 బంతుల్లో చేసిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డ్ను బ్రేక్ చేయడం అసాధ్యం. కానీ భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు.

దూకుడుగా ఆడటం అనేది పూర్తిగా మానసిక స్థితి, సహచర ఆటగా నుంచి లభించే మద్దతుపై ఆధారపడి ఉంటుంది. బ్యాటర్లందరూ బాగా ఆడుతున్నారు. ఈ సిరీస్ ముందు ముందు ఇంకా సరదాగా సాగుతోంది. లెగ్సైడ్ వైపు ఆడటం అనేది ఫీల్డ్ ప్లేస్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నాకు గ్యాప్ దొరికితే ఆఫ్ సైడ్ కూడా షాట్లు కొట్టగలను. నేను కేవలం ఫీల్డింగ్కు తగ్గట్లుగా ఆడాలనుకుంటాను.'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. అభిషేక్ శర్మ విధ్వంసానికి సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ కూడా తోడవ్వడంతో 10 ఓవర్లలోనే న్యూజిలాండ్ విధించిన 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే అందుకుంది.
అభిషేక్ శర్మ బ్యాటింగ్కు ఫిదా అయిన అతని మెంటార్ యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా కొనియాడుతూనే ఎగతాళి చేశాడు. తన ఫాస్టెస్ట్ టీ20 హాఫ్ సెంచరీ రికార్డ్ను అభిషేక్ శర్మ అందుకోలేడని రెచ్చగొట్టాడు. 'అభిషేక్ శర్మ.. ఇప్పటికీ 12 బంతుల్లో 50 పరుగులు చేయడం నీ వల్ల కావడం లేదు కదా? కానీ బాగా ఆడావు - ఇలాగే కొనసాగించు.'అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.