జింబాబ్వేతో తొలి టీ20లో ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేకపోయానని టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అన్నాడు. ఈ పరాజయం నేపథ్యంలో రెండో టీ20లో ఎలాగైనా రాణించాలనే కసితో బరిలోకి దిగానని చెప్పాడు. కోచ్లు, కెప్టెన్లు, టీమ్మేనేజ్మెంట్ తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశారని తెలిపాడు.
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా జింబాబ్వేతో ఆదివారం జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లతో 100 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్తో ఈ మ్యాచ్లో టీమిండియా 100 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అభిషేక్ శర్మ.. తన ఇన్నింగ్స్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఇది నా అద్భుతమైన ప్రదర్శన. నిన్న మాకు ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేకపోయాను. ఈ రోజు నాది అని బలంగా అనుకున్నాను. అలాగే నా రోజుగా మార్చుకున్నాను. టీ20ల్లో మూమెంటమ్ ముఖ్యమని నేను భావిస్తాను. ఈ మ్యాచ్లో చివరి వరకు నేను అదే మూమెంటమ్ను కొనసాగించాను. కోచ్లు, కెప్టెన్లు, టీమ్ మేనేజ్మెంట్ నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా జాగ్రత్తపడ్డారు.
ఓ కుర్రాడిగా మన రోజు అని భావిస్తే.. సత్తా చాటాలని నేను ఎప్పుడూ అనుకుంటాను. ప్రతీ ఓవర్ ముగిసిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్, నేను మాట్లాడుకున్నాము. స్వేచ్చగా షాట్లు ఆడమని అతను చెప్పాడు. నేను ఎప్పుడూ నా సామర్థ్యాన్ని నమ్ముకుంటాను. బంతి నా జోన్లో పడితే బౌండరీకి తరలిస్తాను. అది నేను ఎదుర్కొనే తొలి బంతి అయినా సరే షాట్ ఆడుతాను.'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(46 బంతుల్లో 7 బౌండరీలు, 8 సిక్స్లతో 100) శతక్కొట్టగా.. రుతురాజ్ గైక్వాడ్(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 77 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 48 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, వెల్లింగ్టన్ మసకడ్జా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. ముఖేష్ కుమార్(3/37), ఆవేశ్ ఖాన్(3/15) మూడేసి వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించగా.. రవి బిష్ణోయ్(2/11), వాషింగ్టన్ సుందర్(1/28) కీలక వికెట్లు తీసారు. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ వెస్లీ మధెవెరె(43), లూక్ జోంగ్వే(33) బ్రియాన్ బెన్నెట్(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.