ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్లోనూ టీమిండియా విజయం సాధించింది. ఆదివారం జరిగిన సూపర్-4 మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో మరోసారి పాకిస్థాన్ను చిత్తు చేసింది. అభిషేక్ శర్మ(39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 74) విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. సహిబ్జాద ఫర్హాన్(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఫహీమ్ అష్రఫ్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 20 నాటౌట్) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో శివమ్ దూబే(2/33) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు. టీమిండియా ఫీల్డర్లు నాలుగు క్యాచ్లు వదిలేయడం పాకిస్థాన్కు కలిసొచ్చింది. లేకుంటే ఆ జట్టు తక్కువ స్కోర్కే పరిమితమయ్యేది.

అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి 7 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీకి తోడుగా..శుభ్మన్ గిల్(28 బంతుల్లో 8 ఫోర్లతో 47), తిలక్ వర్మ(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్(2/26) రెండు వికెట్లు తీయగా.. అబ్రర్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్ చెరో వికెట్ తీసారు.
172 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా తమ ఇన్నింగ్స్ను ఘనంగా ప్రారంభించింది. మరోసారి అభిషేక్ శర్మ ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా తరలించాడు. షాహిన్ అఫ్రిది, అబ్రర్ అహ్మద్, సైమ్ అయుబ్లతో పాటు హరిస్ రౌఫ్లను అభిషేక్ శర్మ చితక్కొట్టాడు. అతనికి పోటీగా శుభ్మన్ గిల్ కూడా చెలరేగడంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ సైతం బౌండరీలతో చెలరేగడంతో 8.4 ఓవర్లలోనే భారత్ 100 పరుగుల మార్క్ అందుకుంది.
హాఫ్ సెంచరీకి చేరువైన శుభ్మన్ గిల్ను ఫహీమ్ అష్రఫ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతొ తొలి వికెట్కు నమోదైన 105 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(0) భారీ షాట్ ఆడబోయి వెనుదిరగ్గా.. వరుస బౌండరీలతో చెలరేగిన అభిషేక్ శర్మను అబ్రర్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. బ్యాటింగ్కు వచ్చిన సంజూ తడబడ్డాడు. అతన్ని హరీస్ రౌఫ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. హార్దిక్ పాండ్యాతో కలిసి తిలక్ వర్మ భారీ షాట్లతో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ విజయానంతరం భారత ఆటగాళ్లు నేరుగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిపోయారు. మరోసారి పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.