క్రిస్ గేల్ విధ్వంసం గుర్తుందా? ఇప్పుడు అంతకు మించి అదరగొడుతున్నాడు పంజాబ్ కుర్రాడు. 5000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు.
టీ20 క్రికెట్లో విధ్వంసం అంటే ఒకప్పుడు క్రిస్ గేల్ గుర్తొచ్చేవాడు. పొడవాటి జుట్టు, ఆరామంగా నడుస్తూ వచ్చి బంతిని మైదానం బయట పడేసే ఆ 'యూనివర్స్ బాస్' శైలికి ప్రపంచమంతా ఫిదా అయ్యేది. గేల్ వీడ్కోలు పలికిన తర్వాత అలాంటి ఆటగాడు మళ్ళీ వస్తాడా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న వేళ, టీమ్ ఇండియా యువ సంచలనం అభిషేక్ శర్మ ఆ లోటును భర్తీ చేస్తున్నాడు.
గేల్ తన భీకరమైన కండబలంతో బంతిని చితక్కొడితే, అభిషేక్ శర్మ తన మణికట్టు వేగంతో అద్భుతమైన బ్యాట్ స్వింగ్తో బంతిని స్టాండ్స్లోకి పంపిస్తున్నాడు. వీరిద్దరి ఆటా తీరు వేరైనా, పరుగులు పిండుకునే ప్రాంతాలు మాత్రం ఒక్కటే. ఇద్దరూ స్ట్రెయిట్ డ్రైవ్స్ ఇంకా లెగ్ సైడ్ షాట్లతో బౌలర్ల గుండెల్లో నిద్రపోతారు.

బుధవారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ మరో అద్భుతం చేశాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 5,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
బంతుల పరంగా రికార్డు చూస్తే కేవలం 2,898 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకుని, ఆండ్రీ రస్సెల్ (2,942 బంతులు) రికార్డును బద్దలు కొట్టాడు. అభిషేక్ ప్రతి 9.3 బంతులకు ఒక సిక్సర్ బాదుతున్నాడు. ఇది క్రిస్ గేల్ (9.5 బంతులకు ఒకటి) కంటే మెరుగైన గణాంకం కావడం విశేషం.అంతే కాదు తన గురువు, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ (261 సిక్సర్లు) రికార్డును కూడా అభిషేక్ ఇప్పటికే అధిగమించాడు.
ఐపీఎల్లో క్రిస్ గేల్ నెలకొల్పిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 175 రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టగలడని స్వయంగా గేల్ అభిప్రాయపడ్డాడు. "అభిషేక్ యువకుడు, అతనిలో అపారమైన ప్రతిభ ఉంది. ఖచ్చితంగా అతను నా రికార్డును అధిగమించగలడు" అని గేల్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ప్రస్తుతం అభిషేక్ 171.65 స్ట్రైక్ రేట్తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 8 టీ20 సెంచరీలు సాధించిన ఈ యువ కెరటం, భవిష్యత్తులో మరిన్ని రికార్డులను తన పేరిట లిఖించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.