టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తన ఆరాధ్య క్రికెటర్ అని విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తెలిపాడు. యువరాజ్ సింగ్ కొట్టిన 6 బంతుల్లో 6 సిక్స్లతోటే తాను క్రికెటర్ కావాలనుకున్నానని, టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాలనుకున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2025 టోర్నీలో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ చెలరేగాడు. పసికూన యూఏఈతో పాటు దాయాదీ పాకిస్థాన్ బౌలర్లను చెడుగుడు ఆడాడు.
యూఏఈతో మ్యాచ్లో ఎదుర్కొన్న తొలి రెండు బంతులనే సిక్సర్, ఫోర్గా మలిచిన్ అభిషేక్ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31 పరుగులతో చిన్నపాటి తుఫాన్ సృష్టించాడు. పాకిస్థాన్తో మ్యాచ్లో షాహిన్ షా అఫ్రిదిని చితక్కొట్టాడు. ఇన్నింగ్స్ తొలి రెండు బంతులను 4, 6గా తరలించాడు. అతని మరుసటి ఓవర్లో మరో సిక్స్, బౌండరీ బాదాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30 పరుగులు చేసి వెనుదిరిగాడు. దాంతో షాహిన్ షా అఫ్రిది ఊపిరి పీల్చుకున్నాడు.

అతని ఫియర్లెస్ గేమ్ అభిమానులతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లను ఆకట్టుకుంది. స్పిన్ ఆల్రౌండర్గా కెరీర్ ప్రారంభించిన అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ మార్గదర్శకంలో విధ్వంసకర బ్యాటర్గా మారాడు. అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ దగ్గరుండి బ్యాటింగ్ మెళకువలు నేర్పించాడు. అతని గైడెన్స్ అభిషేక్ శర్మకు కలిసొచ్చింది. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడిన అభిషేక్.. ఆ ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అభిషేక్ శర్మ.. తన మెంటార్ యువరాజ్ సింగ్ తనకు ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పాడు.'యువరాజ్ సింగ్ నా ఆరాధ్య క్రికెటర్. యువీ పా.. ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టడం, భారత్ గెలిచిన ప్రపంచకప్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేయడం నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆ క్షణమే టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. యువీ పాను స్ఫూర్తిగా తీసుకొనే తాను క్రికెటర్గా ఎదిగాను.'అని ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ శర్మ తెలిపాడు.
అరంగేట్ర టీ20 ప్రపంచకప్ 2007లో ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్స్లు బాదిన సంగతి తెలిసిందే. భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్తో పాటు 2011 వన్డే ప్రపంచకప్లో యువరాజ్ సింగ్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా 2011 వరల్డ్ కప్లో క్యాన్సర్తో పోరాడుతూనే దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో అతను మైదానంలో రక్తపు వాంతులు చేసుకున్నాడు. అయినా వెనకడుగు వేయకుండా టోర్నీలో కొనసాగి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అనంతరం క్యాన్సర్కు చికిత్స తీసుకోని కోలుకున్న యువరాజ్ సింగ్.. మునపటిలా ఆడలేకపోయాడు. దాంతో భారత జట్టుకు దూరమై 2019లో రిటైర్మెంట్ ప్రకటించాడు.