తన అమ్ములపొదిలో ఎక్కువగా క్రికెట్ షాట్లు లేవని, ఉన్నవాటినే బాగా ప్రాక్టీస్ చేస్తానని టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తెలిపాడు. న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ(35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్తో 84) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
అతని దూకుడైన బ్యాటింగ్తో ఈ మ్యాచ్లో టీమిండియా 48 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా తన సిక్స్ హిట్టింగ్ సామర్థ్యం గురించి హోస్ట్ అడిగిన ప్రశ్నకు అభిషేక్ శర్మ ఆసక్తికర సమాధానమిచ్చాడు. తనకు ఎక్కువగా క్రికెట్ షాట్లు ఆడటం రాదని చెప్పాడు. 'నేను ఎప్పుడూ నా షాట్లను మాత్రమే నమ్ముకుంటాను. అయితే నాకు ఎక్కువ షాట్లు ఆడడం రాదు. నేను కొన్నింటిని మాత్రమే ఆడగలను. వాటినే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తాను.

నేను నా బ్యాటింగ్ శైలిని హైరిస్క్ అనుకోను. అదే నాకు కంఫర్ట్ జోన్. అయితే నా వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టుకే నా తొలి ప్రాధాన్యత ఇస్తాను. పవర్ ప్లేను టీమ్ సమర్థంగా వినియోగించుకోవాలనుకుంటుంది. అందుకు తగ్గట్లుగా నేను మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ చేస్తాను. మీరు ఈ విషయాన్ని గమనించే ఉంటారు. అన్ని జట్ల ప్రధాన బౌలర్లు మొదటి మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేస్తారు. వారి బౌలింగ్లో స్కోర్ చేయగలిగితే..మనదే పైచేయి అవుతుంది.'అని అభిషేక్ శర్మ తన సక్సెస్ సీక్రెట్ను వెల్లడించాడు.
ఈ మ్యాచ్లో భారత్ 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా..అభిషేక్ శర్మ స్వేచ్ఛగా తన షాట్లను ఆడాడు. సూర్యకుమార్ యాదవ్తో కలిసి పరుగుల విధ్వంసం సృష్టించాడు. అతని ధాటికి భారత్ పవర్ ప్లేలోనే 2 వికెట్లు కోల్పోయినా 68 పరుగులు చేసింది. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ.. 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 84 పరుగులు చేసి వెనుదిరిగాడు.
సూర్యతో కలిసి మూడో వికెట్కు అతను జోడించిన 99 పరుగులు జట్టు విజయానికి బాటలు వేసాయి. చివర్లో రింకూ సింగ్ (44 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో భారత్ 238 పరుగుల భారీ స్కోర్ చేయగా.. న్యూజిలాండ్ 190 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో టీ20 శుక్రవారం రాయ్పూర్ వేదికగా జరగనుంది.