టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన తర్వాత డిమోట్ అయిన రెండో భారత బ్యాటర్గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఓపెనర్గా బరిలోకి దిగి విధ్వంసకర శతకం సాధించిన అభిషేక్ శర్మ.. మూడో టీ20లో డిమోట్ అయ్యాడు.
ఓపెనర్గా కాకుండా ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చాడు. రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి రావడంతో అభిషేక్ శర్మ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. 9 బంతులాడిన అతను ఓ ఫోర్ సాయంతో 10 పరుగులే చేశాడు. సెంచరీ సాధించిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో డిమోట్ అయిన బ్యాటర్గా అభిషేక్ శర్మ చెత్త రికార్డను తన పేరిట లిఖించుకున్నాడు.

గతంలో విరాట్ కోహ్లీ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ఆసియాకప్ 2022లో అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా శతకం బాదిన విరాట్ కోహ్లీ.. తర్వాతి మ్యాచ్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి 2 పరుగులే చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో అభిషేక్ శర్మను డిమోట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శుభ్మన్ గిల్ నిర్ణయాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు.
ఈ మ్యాచ్లో టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 66) హాఫ్ సెంచరీతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 49), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని(2/25), సికందర్ రాజా(2/24) రెండేసి వికెట్లు తీసారు. అనంతరం జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసి ఓటమిపాలైంది. డియోన్ మైర్స్(49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 65 నాటౌట్), క్లైవ్ మదండే(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 37) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/15) వికెట్లు తీయగా..ఆవేశ్ ఖాన్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్(1/15) ఓ వికెట్ తీసాడు.