టీమిండియా యువ ఓపెనర్, సన్రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్స్లు బాదిన భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్కు సారథ్యం వహిస్తున్న అభిషేక్ శర్మ.. మేఘాలయతో గురువారం జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 11 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. 28 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో బ్యాటర్గా నిలిచాడు. భారత్ తరఫున గుజరాత్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ కూడా 28 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. అతను కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనే ఈ ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్లో 11 సిక్సర్లు బాదిన అభిషేక్ శర్మ.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న అత్యధిక సిక్స్ల రికార్డ్ను అధిగమించాడు. ఈ ఏడాది అభిషేక్ శర్మ 38 టీ20 ఇన్నింగ్స్లు ఆడి 87 సిక్సర్లు బాదాడు. రెండేళ్ల క్రితం 2022లో సూర్యకుమార్ యాదవ్ 41 ఇన్నింగ్స్ల్లో 85 సిక్సర్లు బాదాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన మేఘాలయ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. మేఘాలయ ఇన్నింగ్స్లో అర్పిత్ భటేవారా(31) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం పంజాబ్.. అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో 9.3 ఓవర్లలోనే విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్స్లు బాదిన భారత ఆటగాళ్లు:
అభిషేక్ శర్మ(38 ఇన్నింగ్స్ల్లో 87 సిక్సర్లు, 2024)
సూర్యకుమార్ యాదవ్(41 ఇన్నింగ్స్ల్లో 85 సిక్సర్లు, 2022)
సూర్యకుమార్ యాదవ్(33 ఇన్నింగ్స్ల్లో 71 సిక్సర్లు, 2023)
రిషభ్ పంత్(31 ఇన్నింగ్స్ల్లో 66 సిక్సర్లు, 2018)
శ్రేయస్ అయ్యర్(42 ఇన్నింగ్స్ల్లో 63 సిక్సర్లు, 2019)
సంజూ శాంసన్(32 ఇన్నింగ్స్ల్లో 60 సిక్సర్లు, 2024)