టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో లక్ష్య ఛేదనలో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్గా మలిచిన మొదటి భారత బ్యాటర్గా నిలిచాడు. ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈతో బుధవారం జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ విధ్వంసంతో ఈ మ్యాచ్లో భారత్ 27 బంతుల్లోనే విజయాన్నందుకుంది. 9 వికెట్ల తేడాతో యూఏఈని చిత్తు చేసింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 13 ఓవర్లలో 57 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ అలిషన్ షరఫు(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22), కెప్టెన్ ముహమ్మద్ వసీం(22 బంతుల్లో 3 ఫోర్లతో 19) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/7), పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబే(3/3) అద్భుత బౌలింగ్తో యూఏఈ పతనాన్ని శాసించారు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారత్ 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30), శుభ్మన్ గిల్(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(2 బంతుల్లో సిక్స్తో 7 నాటౌట్) మెరుపులు మెరిపించారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖి ఒక వికెట్ తీసాడు. అభిషేక్, గిల్ ధాటికి 93 బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని చేధించింది.
58 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ భారీ సిక్స్ తో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. హైదర్ అలీ బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బంతినే స్టేడియం బయటకు పంపించాడు. ఇలా టీ20ల్లో తొలి బంతిని సిక్స్ బాదిన నాలుగో బ్యాటర్గా నిలిచాడు. 2021లో ఇంగ్లండ్పై రోహిత్ శర్మ, 2024లో జింబాబ్వేపై యశస్వి జైస్వాల్, 2025లో ఇంగ్లండ్పై సంజూ శాంసన్.. అభిషేక్ శర్మ కంటే ముందు ఈ ఫీట్ సాధించారు. కానీ ఈ ముగ్గురు భారత్ ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు ఈ ఘనతను అందుకున్నారు.
అభిషేక్ శర్మ మాత్రం లక్ష్యచేధనలో తొలి బంతిని సిక్సర్గా తరలించాడు. ప్రస్తుతం టీ20ల్లో అభిషేక్ శర్మ వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా దూకుడుగా ఆడటం అభిషేక్ శర్మ స్పెషాలిటీ. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్ట్రైక్రేట్ 193.50 కలిగిన బ్యాటర్ అభిషేక్ శర్మనే. ఛేజింగ్లో ఫస్ట్ బాల్నే సిక్సర్గా మల్చడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'అభిషేక్.. ఏం గుండెరా నీది'అని కామెంట్ చేస్తున్నారు.