టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఆసియాకప్ 2025 టోర్నీలో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతున్న అభిషేక్ శర్మ.. సింగిల్ ఎడిషన్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా రికార్డ్కెక్కాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉన్న రికార్డ్ను అభిషేక్ శర్మ అధిగమించాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్తో బుధవారం జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 75 పరుగులు చేశాడు. అంతకుముందు పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లోనూ 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో అభిషేక్ శర్మ 16 సిక్స్లు బాదాడు. దాంతో సనత్ జయసూర్య 14 సిక్స్ల రికార్డ్ను అభిషేక్ శర్మ అధిగమించాడు. 2008 ఆసియా కప్లో సనత్ జయసూర్య ఈ ఫీట్ సాధించాడు. గత 17 ఏళ్లుగా ఈ రికార్డ్ చెక్కుచెదరకుండా ఉండగా.. తాజాగా అభిషేక్ బ్రేక్ చేశాడు.

ఈ జాబితాలో అభిషేక్ శర్మ(16* సిక్స్లు), సనత్ జయసూర్య(14) తర్వాత రోహిత్ శర్మ(13), షాహిద్ అఫ్రిది(12), రెహ్మనుల్లా గుర్బాజ్(12)లు ఉన్నారు. అభిషేక్ శర్మ 21 టీ20ల్లో 708 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలతో పాటు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతున్న అభిషేక్.. అత్యంత నిలకడగా ఆడుతున్నాడు. ఆసియాకప్లో అతను ప్రతీ మ్యాచ్లో 30 ప్లస్ రన్స్ చేయడం గమనార్హం. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన అభిషేక్ శర్మ అరుదైన ఘనతను అందుకున్నాడు.
ఇలా 25 బంతుల్లోపే అతను అర్థ శతకం సాధించడం ఇది ఐదోసారి. సూర్యకుమార్ యాదవ్(7), రోహిత్ శర్మ(6) తర్వాత ఈ ఫీట్ సాధించిన మూడో బ్యాటర్గా నిలిచాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఆసియా కప్లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్గా కూడా అభిషేక్ శర్మ నిలిచాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లోనూ అభిషేక్ శర్మ 907 రేటింగ్ పాయింట్స్ సొంతం చేసుకున్నాడు. తద్వార టీ20 ర్యాంకింగ్స్ల్లో సూర్యకుమార్ యాదవ్(912), విరాట్ కోహ్లీ(909) తర్వాత అత్యధిక రేటింగ్ పాయింట్స్ అందుకున్న భారత ఆటగాడిగా నిలిచాడు.