పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ అండగా నిలిచాడు. ఈ ఇద్దరూ ప్రపంచకప్లో చెలరేగుతారని, తనది గ్యారంటీ అని చెప్పుకొచ్చాడు.
సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా జరిగిన తొలి మూడు మ్యాచ్ల్లో సూర్య, గిల్ దారుణంగా విఫలమయ్యారు. సూర్య వరుసగా 12 (11), 5 (4), 12 (11) పరుగులు చేస్తే.. శుభ్మన్ గిల్, 4, 0, 28 పరుగులే చేసి నిరాశపర్చాడు. ఈ ఏడాది సూర్య 213 పరుగులు చేయగా.. శుభ్మన్ గిల్ 293 పరుగులే చేశాడు. టీ20 ప్రపంచకప్ ముందు ఈ ఇద్దరూ స్టార్ ఆటగాళ్ల పేలవ ఫామ్ ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ క్రమంలోనే ఈ ఇద్దరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తుది జట్టులో నుంచి తప్పించాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది. సౌతాఫ్రికాతో మూడో టీ20 విజయానంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న అభిషేక్ శర్మ.. తమ కెప్టెన్, వైస్ కెప్టెన్కు అండగా నిలిచాడు. 'టీ20 ప్రపంచకప్లో సూర్య, శుభ్మన్ గిల్.. భారత్ను గెలిపిస్తారు. ఇందుకు నాది గ్యారెంటీ. ప్రపంచకప్కు ముందు కూడా కీలక ఇన్నింగ్స్ ఆడతారు.

శుభ్మన్తో చాలా కాలంగా కలిసి ఆడుతున్నాను. అతను ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలడు. గిల్ గురించి నాకు బాగా తెలుసు. అతనిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. త్వరలో అందరికీ అతనిపై నమ్మకం కలుగుతోంది. సూర్య కూడా పరుగులు చేస్తాడు.'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.
మరోవైపు తన ఫేలవ బ్యాటింగ్పై స్పందించిన సూర్య.. తాను ఫామ్లోనే ఉన్నానని స్పష్టం చేశాడు. 'ఫామ్లో లేను అనే మాటను నేను అంగీకరించను. నెట్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నా. పరుగులు ఎప్పుడు రావాలో అప్పుడు కచ్చితంగా వస్తాయి.'అని తెలిపాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 117 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్(46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 61) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లలో డోనవన్ ఫెర్రెయిరా(15 బంతుల్లో ఫోర్, సిక్స్తో 20), అన్రిచ్ నోర్జ్(12) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/25), హర్షిత్ రాణా(2/34), వరుణ్ చక్రవర్తీ(2/11), కుల్దీప్ యాదవ్(2/12) రెండేసి వికెట్లతో సత్తా చాటగా.. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 120 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 35) తన జోరు కొనసాగించగా.. శుభ్మన్ గిల్(28 బంతుల్లో 5 ఫోర్లతో 28), సూర్యకుమార్ యాదవ్(11 బంతుల్లో 2 ఫోర్లతో 12) మరోసారి తడబడ్డారు. తిలక్ వర్మ(34 బంతుల్లో 3 ఫోర్లతో 26 నాటౌట్), శివమ్ దూబే(4 బంతుల్లో ఫోర్, సిక్స్తో 10 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.