తొలి టెస్ట్లో అవకాశం ఇవ్వలేదని టీమిండియా సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఏ మాత్రం బాధపడలేదని, జట్టు అవసరాలను వారు అర్థం చేసుకున్నారని అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ అన్నాడు. యువ క్రికెటర్లకు అండగా నిలిచేందుకు జడేజా, అశ్విన్ ఎప్పుడూ ముందుంటారని తెలిపాడు.
ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాకు అవకాశం దక్కలేదు. ఏకైక స్పిన్నర్గా బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన వాషింగ్టన్ సుందర్ను ఆడించారు. అయితే ఈ నిర్ణయంతో అశ్విన్, జడేజాలు తీవ్ర అసహనానికి గురైనట్లు వార్తలు వచ్చాయి.

ఇక రెండో టెస్ట్కు ముందు టీమిండియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్తో రెండో రోజుల వామప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అభిషేక్ నాయర్ శుక్రవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అశ్విన్, జడేజాల వ్యవహారంపై అభిషేక్ నాయర్ స్పందించాడు. వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జట్టు విజయంపైనే టీమిండియా ఫోకస్ పెట్టిందని, ఆటగాళ్లు కూడా ఇదే ఫాలో అవుతున్నారని తెలిపాడు.
'జట్టు పరిస్థితిని అర్థం చేసుకోని సీనియర్లు ఉంటేనే సమస్య. కానీ రవీంద్ర జడేజా, అశ్విన్ వంటి ఆటగాళ్లతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారి వల్ల పని ఇంకా సులువవుతోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏం నమ్ముతాడో దానినే జట్టంతా పాటిస్తుంది. వ్యక్తిగత ప్రదర్శనల కోసం కాకుండా జట్టు విజయం కోసం ఆడాలనేది గంభీర్ అభిమతం. జట్టు సంప్రదాయం కూడా అలానే ఉంది. యువ క్రికెటర్లకు అండగా నిలిచేందుకు జడేజా, అశ్విన్ ఎల్లప్పుడూ ముందుంటారు. 'అని అభిషేక్ నాయర్ చెప్పుకొచ్చాడు.
అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్ట్లో అశ్విన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అడిలైడ్ వికెట్ స్పిన్కు అనుకూలంగా ఉండటం.. ఆసీస్ బ్యాటర్లలో ఎక్కువగా లెఫ్టార్మ్ బ్యాటర్లు ఉండటంతో అశ్విన్ను తుది జట్టులోకి తీసుకోనున్నారు.
వ్యక్తిగత పనులతో స్వదేశానికి వచ్చిన గంభీర్.. రెండో టెస్ట్ ప్రారంభమయ్యే సమయానికి జట్టుతో కలుస్తాడని అభిషేక్ నాయర్ స్పష్టం చేశాడు. 'గౌతీ భాయ్ అతి త్వరలోనే ఇక్కడికి రానున్నాడు. అయితే అతను ఏ తేదీన వస్తాడని కచ్చితంగా చెప్పలేను. కానీ రెండో టెస్ట్ ప్రారంభానికి ముందే అడిలైడ్ చేరుకుంటాడు.'అని తెలిపాడు.