టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ ఆరంభంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడని మాజీ క్రికెటర్, కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తెలిపాడు. జుగుప్సాకరమైన రీతిలో రోహిత్ శర్మను హేళన చేశారని, ముఖ్యంగా అతని బరువును ఉద్దేశించి జోకులు పేల్చేవారని గుర్తు చేసుకున్నాడు.
అతని పొట్టను ఉద్దేశించి బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడంతో పాటు బ్యాటింగ్ వైఫల్యాన్ని ఉద్దేశించి రెండు నిమిషాల మ్యాగీ మ్యాన్ అంటూ ట్రోల్ చేసేవారని చెప్పుకొచ్చాడు. కానీ ఈ అవమానాలకు రోహిత్ శర్మ ఏనాడు కృంగిపోలేదని, మరింత కసిగా కష్టపడి టీమిండియా స్టార్ బ్యాటర్గా ఎదిగాడని తెలిపాడు.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ నాయర్.. రోహిత్ శర్మకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. '2011 వన్డే ప్రపంచకప్ జట్టులో రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. ఆ సమయంలో నేను అతనితోనే ఉన్నాను. అప్పటికి రోహిత్ కాస్త అధిక బరువుతో ఉన్నాడు. ఆ సమయంలో యువరాజ్ సింగ్తో కలిసి రోహిత్ శర్మ ఓ యాడ్లో నటించాడు.
ఆ యాడ్ను నేను ఇప్పటికీ మరిచిపోను. ఆ వీడియోలో రోహిత్ శర్మ విజువల్ కట్ చేసి అతని పొట్ట చుట్టూ ఓ గీత గీసి ట్రోల్ చేశారు. నేను వెంటనే ఫిట్నెస్ విషయంలో కష్టపడాలని రోహిత్ శర్మకు చెప్పాను. దానికి అతను సానుకూలంగా బదులిచ్చాడు. నువ్వేం చెబితే అదే చేస్తా. ఐపీఎల్ తర్వాత నువ్వు ఒక కొత్త రోహిత్ శర్మను చూస్తావని ఆ రోజు నాతో అన్నాడు.
అన్నట్లుగా చేసి చూపించాడు. కొన్నాళ్లకే హిట్మ్యాన్గా గుర్తింపు పొందాడు. కెరీర్ పట్ల తన ఆలోచన ధోరణిని పూర్తిగా మార్చుకున్నాడు. ఎలా ముందుకు సాగాలని అనుకున్నాడో దానికోసం తీవ్రంగా కష్టపడ్డాడు. రోహిత్ శర్మ మారిపోవడంతో పాటు సక్సెస్ కూడా సాధించాడు. కెరీర్ ఆరంభంలో రోహిత్ శర్మను చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేశారు. రెండు నిమిషా మ్యాగీ మ్యాన్ అంటూ హేళన చేశారు. కానీ ఈ విమర్శలకు అతను బ్యాట్తోనే బదులిచ్చాడు.'అని అభిషేక్ నాయర్ చెప్పుకొచ్చాడు.
ధోనీ సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలు, పేలవ ప్రదర్శనతో జట్టుకు దూరమయ్యాడు. 2011 వన్డే ప్రపంచకప్కు ఎంపిక కాలేకపోయాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించిన అతను మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటి కెప్టెన్ ధోనీ.. ఓపెనర్గా అవకాశం ఇవ్వడంతో సత్తా చాటిన రోహిత్ జట్టులో పాతుకుపోయి కెప్టెన్గా ఎదిగాడు.