ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) హెడ్ కోచ్గా అభిషేక్ నాయర్ను నియమించినట్లు తెలుస్తోంది. టీమిండియా అసిస్టెంట్ కోచ్ బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించిన తర్వాత అభిషేక్ నాయర్.. కేకేఆర్ సపోర్ట్ స్టాఫ్గా బాధ్యతలు చేపట్టారు. కేకేఆర్ మెంటార్గా గౌతమ్ గంభీర్ ఉన్నప్పుడు కూడా అభిషేక్ నాయర్ బ్యాటింగ్ కోచ్గా కేకేఆర్కు సేవలందించాడు.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు క్లోజ్ ఫ్రెండ్ అయిన అభిషేక్ నాయర్ హిట్ మ్యాన్కు కూడా పర్సనల్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఆసీస్ పర్యటనకు ముందు రోహిత్ ప్రాక్టీస్ను అభిషేక్ నాయరే పర్యవేక్షించాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ 11 కిలోల బరువు తగ్గి పూర్తి ఫిట్నెస్ సాధించడంలో అభిషేక్ నాయర్దే కీలక పాత్ర.

ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలం డిసెంబర్లో జరగనుంది. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు తమ జట్టులో చేయాల్సిన మార్పులపై ఫోకస్ పెట్టాయి. మినీ వేలానికి ముందు పటిష్టమైన సపోర్ట్ స్టాఫ్ను నియమించుకుంటున్నాయి. ఇన్నాళ్లు కేకేఆర్ హెడ్ కోచ్గా వ్యవహరించిన చంద్రకాంత్ పండిట్.. ఆ బాధ్యతల నుంచి నిష్క్రమించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో కేకేఆర్ దారుణంగా విఫలమవడంతో కేకేఆర్.. చంద్రకాంత్ పండిట్ కాంట్రాక్ట్ను పొడిగించలేదు.
ఈ క్రమంలోనే అసిస్టెంట్ కోచ్గా ఉన్న అభిషేక్ నాయర్కు హెడ్ కోచ్గా ప్రమోషన్ ఇచ్చారు. హెడ్ కోచ్గా అభిషేక్ నాయర్కు పెద్దగా అనుభవం లేకపోయినా.. ఎంతో మంది స్టార్ ఆటగాళ్లను అతను పర్యవేక్షించాడు. రోహిత్ శర్మతో పాటు దినేశ్ కార్తీక్, కేఎల్ రాహుల్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తీ, రఘువంశీల ఆటను అభిషేక్ నాయర్ ప్రత్యేకంగా పర్యవేక్షించాడు. వారి ఆటను మెరుగుపరుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అభిషేక్ నాయర్కు కేకేఆర్ హెడ్ కోచ్గా ప్రమోషన్ దక్కినట్లు తెలుస్తోంది. అయితే ఈ నియామకంపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.