న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత టెస్ట్ టీమ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవాళీ క్రికెట్లో రాణించినవారిని పట్టించుకోలేదని, ఐపీఎల్లో సత్తా చాటిన ఆటగాళ్లకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సెలెక్టర్లపై మండిపడుతున్నారు.
ఈక్రమంలోనే టీమిండియా సెలెక్షన్ తీరుపై అభినవ్ ముకుంద్ ట్విటర్ వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. భారత జట్టులోకి రావాలంటే రంజీ ట్రోఫీ ఆడటం కంటే ఐపీఎల్ ఆడితే సరిపోతుందన్నాడు. 'వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసిన విధానాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. నా మదిలో వచ్చిన ఆలోచనలను ట్విటర్ వేదికగా పంచుకుంటున్నా.

తన రాష్ట్రం కోసం రంజీ ట్రోఫీ ఆడిన ఆటగాళ్లకు వచ్చిన లాభం ఏంటి? ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం వల్ల జాతీయ జట్టులోకి వేగంగా అవకాశం వస్తుందనేది స్పష్టంగా తెలుస్తోంది.'అని అభినవ్ ముకుంద్ ట్వీట్ చేశాడు.
ఇక దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకొని టెస్ట్ టీమ్ను ఎంపిక చేసినప్పుడు రంజీ క్రికెట్ ఆడటం ఎందుకని ప్రశ్నించాడు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ప్రతిభను తక్కువ చేయకున్నా.. దేశవాళీ క్రికెట్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వారిని ఎంపిక చేస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యూ ఈశ్వరన్ వంటి ఆటగాళ్లు దేశవాళీలో నిలకడగా రాణిస్తున్నా.. భారత జట్టులోకి రాలేకపోతున్నారని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంజీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిని కాకుండా ఐపీఎల్లో సత్తా చాటిన వారిన పరిగణలోకి తీసుకోవడం వల్ల భారత టెస్ట్కు నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
జూలై 12 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో టీమిండియా.. ఆతిథ్య వెస్టిండీస్తో రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. 16 మంది సభ్యులతో కూడిన టెస్ట్ టీమ్ వివరాలను ఎస్ఎస్ దాస్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీ శుక్రవారం వెల్లడించింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమైన చతేశ్వర్ పుజారాతో పాటు ఉమేశ్ యాదవ్లపై వేటు వేసిన సెలెక్టర్లు.. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్లకు అవకాశం ఇచ్చారు.