ఐపీఎల్ 2026 సీజన్కు రంగం సిద్దమైంది. మరో 48 గంటల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ సన్నాహకాలను పూర్తి చేసుకొని తమదైన వ్యూహాలతో టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. మరోవైపు మాజీ క్రికెటర్లు తమదైన వ్యాఖ్యలు, జోస్యాలు, అంచనాలతో ఈ క్యాష్ రిచ్ లీగ్పై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్లో విజేతగా నిలిచే జట్టు ఏది? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానెల్తో మాట్లాడిన భారత మాజీ ఓపెనర్ అభినవ్ ముకుంద్.. ప్లే ఆఫ్స్ చేరే నాలుగు జట్లను అంచనా వేసాడు.
గతేడాది ప్లే ఆఫ్స్ చేరిన నాలుగు జట్లలో మూడు జట్లు ఈ సారి నాకౌట్ దశకు చేరుతాయని చెప్పాడు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఈ సీజన్లో కూడా ఆధిపత్యం చెలాయిస్తుందని, మళ్లీ ప్లే ఆఫ్స్ చేరుతుందన్నాడు.

18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ..గత సీజన్లో టైటిల్ అందుకున్న సంగతి తెలిసిందే. క్వాలిఫయర్-1తో పాటు ఫైనల్లోనూ పంజాబ్ కింగ్స్ను ఓడించిన ఆర్సీబీ తొలి టైటిల్ను అందుకుంది. గతేడాది రన్నరప్గా నిలిచిన పంజాబ్ కింగ్స్.. ఈ సారి కూడా ప్లే ఆఫ్స్ చేరుతుందని ముకుంద్ అభిప్రాయపడ్డాడు. పంజాబ్ కింగ్స్తో పాటు ముంబై ఇండియన్స్ కూడా నాకౌట్ దశకు అర్హత సాధిస్తుందని అంచనా వేసాడు.
గతేడాది క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిన సంగతి తెలిసిందే. గత ఐదు సీజన్లలో ముంబై కేవలం రెండు సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్ చేరింది. ఇక నాలుగో జట్టుగా ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2026 సీజన్లో ప్లే ఆఫ్స్ చేరుతుందని ముకుంద్ అభిప్రాయపడ్డాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది.
ఐపీఎల్ 2026 సీజన్లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆడనుంది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో వాంఖడే వేదికగా ఆడనుంది.