అభినందన్ సింగ్.. ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్లో చర్చనీయాంశమైన పేరు. ఐపీఎల్ 2026 సీజన్ మొదలయ్యే వరకు అతని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. సన్రైజర్స్ హైదరాబాద్తో శనివారం జరిగిన తొలి మ్యాచ్లో ఆర్సీబీ తరఫున 29 ఏళ్ల అభినందన్ సింగ్ అరంగేట్రం చేశాడు.
తొలి మ్యాచ్లో బౌలర్గా తనదైన ముద్ర వేయకపోయినా.. డేంజరస్ ఇషాన్ కిషన్ను ఔట్ చేశాడు. దాంతో ఈ ఆర్సీబీ నయా పేసర్ టాక్ ఆఫ్ ది నేషన్గా మారాడు. ఎలాంటి దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడకుండా నేరుగా ఐపీఎల్ ఆడిన క్రికెటర్గా గుర్తింపు పొందిన అభినందన్ సింగ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.
అయితే అభినందన్ సింగ్ క్రికెట్ ప్రయాణం స్ఫూర్తి దాయకంగా ఉంది. కలెక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కుర్రాడు.. విధి పెట్టిన పరీక్షలో క్రికెటర్గా ఎదిగాడు. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్కు చెందిన అభినందన్ సింగ్.. యూపీఎస్సీ పరీక్షలకు సిద్దమయ్యేందుకు ఢిల్లీ వెళ్లాడు. అతని తండ్రి ఒక సాధారణ రైతు కావడంతో తన ఖర్చుల కోసం ఢిల్లీలో ప్రైవేట్ ట్యూషన్లు చెప్పేవాడు. ఒకవైపు కోచింగ్ తీసుకుంటూ.. మరోవైపు తనకు ఇష్టమైన క్రికెట్ ఆడేవాడు. పగలు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ, రాత్రిపూట చదువుకునేవాడు.
మొదట్లో టెన్నిస్ బాల్తో సరదాగా ఆడిన అభినందన్ సింగ్.. ఆ తర్వాత ఢిల్లీలోని మద్రాస్ క్లబ్లో శిక్షణ పొందాడు. టెన్నిస్ బాల్తో మెరుగైన ప్రదర్శన చేయడంతో అతన్ని మద్రాస్ క్రికెట్ క్లబ్ ఆహ్మానించింది. ఆ క్లబ్ తరఫున సత్తా చాటడంతో యూపీ టీ20 లీగ్ 2024, 2025 సీజన్లో లక్నో ఫాల్కన్స్ తరఫున ఆడే అవకాశం దక్కింది.

2024 సీజన్లో 10 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో కేకేఆర్కు అభినందన్ సింగ్ నెట్ బౌలర్గా సేవలు అందించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ.. అతన్ని రూ.30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం అతనికి దక్కలేదు. అయినా అతన్ని ఐపీఎల్ 2026 సీజన్ కోసం రిటైన్ చేసుకుంది.
వ్యక్తిగత కారణాలతో ఆర్సీబీ స్టార్ పేసర్ యష్ దయాల్ ఈ సీజన్కు దూరమవడంతో అతని స్థానంలో అభినందన్ సింగ్కు అవకాశం కల్పించింది. ప్రాక్టీస్ మ్యాచ్ల్లో కోహ్లీని రెండు సార్లు ఔట్ చేయడంతో అతనికి ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.
అభినందన్ సింగ్ విజయం వెనుక అతని కోచ్ రణధీర్ సింగ్ కృషి ఎంతో ఉంది. ఇప్పటికే సుయాష్ శర్మ వంటి ఆటగాళ్లను తీర్చిదిద్దిన మద్రాస్ క్లబ్ అకాడమీ నుంచే అభినందన్ కూడా వచ్చాడు. 29 ఏళ్ల వయసులో ఎలాంటి బీసీసీఐ టోర్నీలు ఆడకపోయినా, కేవలం క్లబ్ క్రికెట్ ఆడుతూ ఐపీఎల్ స్థాయికి చేరడం అంటే మామూలు విషయం కాదు. అభినందన్ సింగ్ అరంగేట్రంపై రణధీర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు.
'అభినందన్ ఇంకా బాగా ఆడగలడు. ఈ మ్యాచ్ అతనికి మంచి అనుభవం. అతని బౌలింగ్ శైలి వల్ల భారత పిచ్లపై బంతికి అదనపు బౌన్స్ లభిస్తుంది. తొలి మ్యాచ్లో పరుగులు ఇచ్చుకున్నాడు. కానీ అతను ఇంకా వేగంగా బౌలింగ్ చేయగలడు. టీ20ల్లో పరుగులు సమర్పించుకోవడం బౌలర్లకు మాములే. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతను చాలా కీలకం అవుతాడు. కచ్చితంగా వచ్చే మ్యాచ్ల్లో మరింత బలంగా తిరిగి వస్తాడు’ అని రణధీర్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.