ఐపీఎల్ కారణంగానే తన కొడుకు అరంగేట్రం ఆలస్యమైందని భారత యువ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ పరమేశ్వరన్ అన్నారు. ఐపీఎల్లో ఆడి ఉంటే ఇప్పటికే తన కొడుకు టీమిండియాకు ఆడేవాడని అభిప్రాయపడ్డాడు. తమిళనాడుకు చెందిన అభిమన్యుఈశ్వరన్.. దేశవాళీ క్రికెట్లో పశ్చిమ బెంగాల్కు ఆడుతున్నాడు. సుదీర్ఘ కాలంగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా.. అతనికి టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. భారత జట్టులో చోటు దక్కించుకున్నా బెంచ్కే పరిమితమయ్యాడు.
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ రోహిత్ శర్మ గైర్హాజరీలోనూ అభిమన్యు ఈశ్వరన్కు చోటు ఇవ్వలేదు. సుదీర్ఘ కాలంగా భారత్-ఏ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో భారత్-ఏ జట్టును నడిపిస్తున్నాడు. సీనియర్ టీమ్లోనూ అభిమన్యు ఈశ్వరన్కు చోటు దక్కింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అభిమన్యు ఈశ్వరన్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సిరీస్ కోసం అభిమన్యు సిద్దమవుతున్నాడని అతని తండ్రి రంగనాథన్ పరమేశ్వరన్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఐపీఎల్లో ఆడి ఉంటే..
'అభిమన్యుకు ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కి ఉంటే.. చాలా రోజుల క్రితమే టీమిండియా తరఫున అరంగేట్రం చేసేవాడు. ఐపీఎల్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతోంది. అభిమన్యు ఆర్భాటం ప్రదర్శించే ఆటగాడు కాదు. సెంచరీ చేసిన తర్వాత గ్రౌండ్ మొత్తం పరుగులు తీయడం.. సంబరాలు చేసుకోవడం వంటి పనులు చేయడు. అయితే ఇలా చేయకపోవడం అతనికి ప్రతికూలంగా మారిపోయాయి. అభిమన్యు నిలకడగా రాణించే ఆటగాడు. అతను 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 48.87 సగటుతో 7,674 పరుగులు చేశాడు. ఇవే అతని నిలకడకు నిదర్శనం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ వంటి విభిన్నమైన పరిస్థితుల్లో ఆడిన అతని అనుభవం ఇతర ఆటగాళ్ల కంటే అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.
డ్యూక్ బంతులతో ప్రాక్టీస్..
ఇంగ్లండ్ పర్యటన కోసం అభిమన్యు ప్రత్యేకంగా సిద్దమవుతున్నాడు. ఉదయం 5.30 గంటలకే నిద్రలేచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. నెట్స్లో గంటల తరబడి పేసర్లను ఎదుర్కొంటున్నాడు. అభిమన్యు ప్రాక్టీస్కు ఎటువంటి లోటు లేకుండా రెండు డజన్ల డ్యూక్ బంతులను ఏర్పాటు చేశాం. ఇంగ్లండ్ బౌన్సీ పిచ్లకు తగ్గట్లు ఎర్రమట్టితో కూడిన పచ్చిక వికెట్పై బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. నాలుగు, ఐదో రోజు ఆటలో స్పిన్నర్లను ఎదుర్కోవడానికి కూడా అభిమన్యు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఇంగ్లండ్ కండిషన్స్కు తగ్గట్లు ప్రతీ బౌలర్ను ఎదుర్కోవడానికి సన్నదమవుతున్నాడు. ప్రతీ బౌలర్ను ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నాడు.'అని రంగనాథన్ చెప్పుకొచ్చారు.
కొడుకు పేరిట స్టేడియం..
చార్టర్డ్ అకౌంటెంట్ అయిన రంగనాథన్ ఈశ్వరన్.. క్రికెట్పై ఉన్న ప్రేమతో కొడుకును క్రికెటర్గా చూడాలనుకున్నాడు. అందుకోసం అభిమన్యు పుట్టకముందే.. అభిమన్యు క్రికెట్ అకాడమీని స్థాపించి, అదే పేరుతో స్టేడియం కూడా నిర్మించారు. అభిమన్యు డెహ్రాడూన్లో పుట్టి పెరిగినా.. క్రికెట్లో మెరుగైన శిక్షణ కోసం పదేళ్ల వయసులోనే కోల్కతాకు వెళ్లాడు. అభిమన్యు బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీలో ఉత్తరాఖండ్తో జరిగిన మ్యాచ్లో తన తండ్రి నిర్మించిన అభిమన్యు క్రికెట్ స్టేడియంలోనే సెంచరీ సాధించాడు.