
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ కంటే వీరేంద్ర సెహ్వాగ్ మోస్ట్ డేంజరస్ ప్లేయరని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ అన్నాడు. సెహ్వాగ్ను ఔట్ చేసేందుకు పాకిస్థాన్ ఆటగాళ్లు చాలా కష్టాలు పడేవారని గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజాక్.. టీమిండియాతో మ్యాచ్లకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
సెహ్వాగ్, సచిన్తో పాటు యువరాజ్ సింగ్ కూడా పాక్ బౌలర్లను ఇబ్బంది పెట్టేవాడని, ఈ ముగ్గుర్ని ఔట్ చేస్తే గొప్పగా ఫీలయ్యేవాళ్లమని తెలిపాడు. బౌలింగ్లో జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ బౌలింగ్ను ఫేస్ చేయడానికి పాక్ ఆటగాళ్లు ఇబ్బంది పడేవారని గుర్తు చేసుకున్నాడు.
'నా అభిప్రాయం ప్రకారం టీమిండియాలో మోస్ట్ డేంజరస్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్. దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ కంటే కూడా సెహ్వాగ్ మమ్మల్ని ఇబ్బందిపెట్టేవాడు. సచిన్, సెహ్వాగ్ను ఔట్ చేసేందుకు పాకిస్థాన్ ప్రత్యేకమైన ప్రణాళికలు రచించేది.
ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్ను ఎంత త్వరగా ఔట్ చేస్తే టీమిండియాపై అంత త్వరగా పై చేయి సాధించవచ్చని భావించేవాళ్లం. మిడిల్ ఆర్డర్లో యువరాజ్ సింగ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు. యువరాజ్ సింగ్ను ఔట్ చేయడానికి కూడా బౌలింగ్, ఫీల్డింగ్లో మార్పులు చేయాల్సి వచ్చేది. సచిన్, సెహ్వాగ్, యువీని ఔట్ చేస్తే పెద్ద ప్లేయర్లను ఔట్ చేసామని గొప్పగా చెప్పుకునేవాళ్లం.
భారత బౌలింగ్లో హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్లను ఎదుర్కోవడానికి పాక్ బ్యాటర్లు ఇబ్బంది పడేవారు. ఈ ఇద్దర్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా సిద్దమయ్యేవాళ్లం. జహీర్ ఖాన్ తర్వాత ఇర్ఫాన్ పఠాన్ కూడా కొన్నాళ్లు ఇబ్బంది పెట్టాడు.
నాకు తెలిసినంత వరకూ టీమిండియాలో టాప్ క్లాస్ పెర్ఫామెన్స్ ఇచ్చిన ఆటగాళ్లు వీళ్లు మాత్రమే.'అని రజాక్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడంటే ఇరు దేశాల సరిహద్దుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు కానీ.. నైంటీస్, 2000లో భారత్-పాక్ల మధ్య చాలా మ్యాచ్లు జరిగాయి. వీరేంద్ర సెహ్వాగ్ పాక్పైనే టెస్ట్ల్లో తొలి ట్రిపుల్ సెంచరీ బాదాడు.