Abdul Razzaq: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ మరోసారి భారత్పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇటీవలే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్పై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రజాక్.. మరోసారి తన నోటి విరేచనాలతో భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓడిపోయి మంచి పనైందని అభిప్రాయపడ్డాడు. టీమిండియా పరాజయంతో క్రికెట్ గెలిచిందన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో గత ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా విఫలమైన టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

టోర్నీ ఆసాంతం అదిరిపోయే ఆటతో వరుసగా 10 విజయాలు సాధించిన రోహిత్ సేన.. కీలక పోరులో మాత్రం తేలిపోయింది. పేలవ బ్యాటింగ్కు దురదృష్టం కూడా తోడవ్వడంతో టీమిండియా మరోసారి ప్రపంచకప్ టైటిల్ను చేజార్చుకుంది. ఈ పరాజయంపై తాజాగా స్పందించిన అబ్దుల్ రజాక్.. అడ్డదారిలో టైటిల్ గెలిచేందుకు టీమిండియా ప్రయత్నించిందని ఆరోపించాడు.
'క్రికెట్ గెలిచింది. భారత్ ఓడిపోయింది. ఒకవేళ భారత్ ప్రపంచకప్ గెలిచి ఉంటే క్రికెట్కు అది చాలా బాధాకరమైన క్షణంగా మిగిలేది. ఎందుకంటే మ్యాచ్కు ముందే టీమిండియా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంది. ఐసీసీ ఫైనల్కు ఇలాంటి చెత్త పిచ్ను ఉపయోగించడం నేను చూడలేదు. భారత్ ఓడిపోవడం క్రికెట్కు మంచి పరిణామం'అని అబ్దుల్ రజాక్ అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా టాస్ ఓడిపోవడం కొంపముంచింది. టాస్ గెలిచిన ఆసీస్కు పిచ్ కండిషన్స్ కలిసొచ్చాయి. స్లో పిచ్పై ఆ జట్టు బౌలర్లు చెలరేగగా.. భారత బ్యాటర్లు తడబడ్డారు. బౌలింగ్లో డ్యూ రావడంతో ఆసీస్కు బ్యాటింగ్ ఈజీ అయిపోయింది. దాంతో ఆ జట్టు సునాయస విజయాన్ని అందుకుంది.
పాకిస్థాన్ పేలవ ప్రదర్శనపై ఓ కార్యక్రమంలో మాట్లాడిన అబ్దుల్ రజాక్.. ఐశ్వర్య రాయ్ను ప్రస్తావిస్తూ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు. పీసీబీని విమర్శిస్తూ.. తాను ఐశ్వర్య రాయ్ను పెళ్లి చేసుకోవడం వల్ల పవిత్రమైన పిల్లలు పుడతారని అనుకుంటే ఎలా?'అని మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.