World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమితో బాధలో ఉన్న అభిమానులకు యంగ్ ఇండియా కాస్త ఊరట కల్పించింది. ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్లో సంచలన విజయాన్ని అందుకుంది. ప్రపంచకప్ ఆడిన భారత ఆటగాళ్లంతా ఈ సిరీస్కు దూరం కాగా... సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని కుర్రాళ్ల జట్టు ఈ సిరీస్ బరిలోకి దిగుతోంది.
టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఈ సిరీస్ నుంచే సన్నాహకాలు మొదలుపెట్టింది. వన్డే ప్రపంచకప్లో దారుణంగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్ తనకు అచ్చొచ్చిన టీ20 ఫార్మాట్లో మాత్రం విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. తనకే సాధ్యమైన 360 డిగ్రీల షాట్స్తో అభిమానులను అలరించాడు.

209 పరుగుల భారీ లక్ష్య చేధనలో 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను.. ఇషాన్ కిషన్(39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 58)తో కలిసి సూర్య ఆదుకున్నాడు. మూడో వికెట్కు 112 పరుగులు జోడించాడు. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్.. సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. కానీ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 80 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూర్య కొట్టిన బౌండరీలు, సిక్స్లు అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులను ఆకట్టుకున్నాయి. ఇదే బ్యాటింగ్ ప్రపంచకప్ ఫైనల్లో చేసుంటే టీమిండియా విజేతగా నిలిచేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
వన్డే ప్రపంచకప్ 2023లో ఏడు మ్యాచ్లు ఆడిన సూర్య.. ఇంగ్లండ్తో మ్యాచ్లో 49 పరుగుల మినహా మరే మ్యాచ్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ వచ్చిన సూర్య.. తన విధ్వంసకర బ్యాటింగ్తో విలువైన పరుగులు జోడించకుండా.. సింగిల్స్ తీస్తూ చికాకు తెప్పించాడు.
చివరకు చెత్త షాట్కు క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ మ్యాచ్లో సూర్య భారీ షాట్లు ఆడి 40 పరుగులు చేసినా టీమిండియా 260-70 పరుగుల లక్ష్యం నమోదు చేసేదని, అప్పుడు గెలిచేందుకు ఆస్కారం ఉండేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజా ఇన్నింగ్స్ను ఉద్దేశించి ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. 'ప్రపంచకప్ ఫైనల్లో గిట్ల ఆడితే అయిపోవ్ కదరా సూరీడు'అని సెటైర్లు పేల్చుతున్నారు.