
అశ్విన్ తీసుకోకపోవడంపై..
ఓవల్ టెస్ట్లో అశ్విన్కు మంచి రికార్డు ఉండటంతో పాటు అక్కడి పిచ్ స్పిన్కు అనుకూలం కావడంతో నాలుగో టెస్ట్లో అతనికి చోటు ఖాయమేనని అంతా భావించారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం అశ్విన్ను తీసుకోలేదు. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ విధానాన్నే అనుసరించాడు. ఏకైక స్పిన్నర్గా బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన జడేజాకు తిరిగి అవకాశమిచ్చాడు. దీనిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శలు గుప్పించారు. కోహ్లీ ఘోర తప్పిదం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి రోజు మ్యాచ్ భారత్వైపు మళ్లే వరకు విమర్శలు గుప్పించారు. అశ్విన్ ఉంటే భారత్ విజయం సులువయ్యేదని అభిప్రాయపడ్డారు.
ఆస్వాదించండి..
అయితే కోహ్లీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రవీంద్ర జడేజా, భారత పేసర్లు చెలరేగడంతో భారత్ ఓవల్లో చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఈ విజయంపై ట్వీటర్ వేదికగా స్పందించిన ఏబీడీ ఆస్తకర వ్యాఖ్యలు చేశాడు. 'టెస్టు క్రికెట్ అభిమానులుగా జట్టు ఎంపిక, అర్థంలేని విషయాల గురించి ఆందోళన చెందకండి. మీ కళ్లెదుట కనిపిస్తున్న పోటీ, అభిరుచి, నైపుణ్యాలు, దేశభక్తిని అభినందించండి. ఎందుకంటే మీరు మంచి ఆటను మిస్సవుతున్నారు!' అని డివిలియర్స్ ట్వీట్ చేశాడు.

కోహ్లీ కెప్టెన్సీ సూపర్..
'టీమిండియా అద్భుతంగా ఆడింది. కోహ్లీ నాయకత్వం బాగుంది. కొంతమంది క్రికెటర్లు అసామాన్యమైన నైపుణ్యాలు, ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇంగ్లండ్, రూట్ బాగానే ఆడారు! అందమైన ఆటకు ఈ మ్యాచ్ గొప్ప ప్రకటన! ఆఖరి పోరు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా' అని ఏబీడీ మరో ట్వీట్ చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్ కోసం సోమవారమే దుబాయ్ చేరుకున్న ఏబీడీ.. ప్రస్తుతం క్వారంటైన్ పాటిస్తున్నాడు. మళ్లీ అందరినీ చూస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపాడు.

ఐపీఎల్కు రెడీ అవుతున్నా..
కొందరు ఇంగ్లండ్లో ఉన్నారని, త్వరలోనే జట్టులో చేరతారని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టీమ్ను ఉద్దేశించి తెలిపాడు. త్వరగానే ఆర్సీబీ జోరు అందుకుంటుందని పేర్కొన్నాడు. 'ఐపీఎల్కు నేను సిద్ధమవుతున్నా. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అధిగమిస్తున్నాను. పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సంతరించుకొనేందుకు, బంతిని బాదేందుకు ప్రయత్నిస్తున్నాను.
ఐసోలేషన్ ముగియగానే సాధన మొదలు పెడతాను' అని ఏబీడీ చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 15 వరకు యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 సీజన్ మలిదశ మ్యాచ్లు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా జట్లు అరబ్ గడ్డపై ప్రాక్టీస్ క్యాంప్ మొదలుపెట్టాయి. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఆటగాళ్లు సెప్టెంబర్ 15న నేరుగా ఐపీఎల్ బయోబబుల్లో కలవనున్నారు.


Click it and Unblock the Notifications












