టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్లో రీఎంట్రీ ఇవ్వడం తనకేం ఆశ్చర్యం కలిగించలేదని సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే తనకు దక్కని అవకాశం కోహ్లీ, రోహిత్లకు దక్కిందని తెలిపాడు. అనుభవం కలిగిన కోహ్లీ, రోహిత్లను టీ20 జట్టులోకి తీసుకొని టీమిండియా మేనేజ్మెంట్ మంచి పనిచేసిందని అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న ఏబీ డివిలియర్స్.. ప్రముఖ న్యూస్ ఎజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20ల్లోకి రీఎంట్రీ ఇవ్వడం నాకేం ఆశ్చర్యం కలిగించలేదు. ఈ ఇద్దరూ మరో ప్రపంచకప్ ఆడుతున్నందుకు సంతోషంగా ఫీలవుతున్నాను.

టీ20 ప్రపంచకప్ గెలవాలంటే అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగాలి. కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ నేపథ్యంలో వస్తున్న విమర్శలను నేను అర్థం చేసుకోగలను. ఈ ఇద్దరి రాకతో కొంతమంది యువకులకు అన్యాయం జరుగుతుంది. గత కొంత కాలంగా జట్టులో కొనసాగిన కుర్రాళ్లు అవకాశం కోల్పోతారు. కానీ అనుభవం కలిగిన ఆటగాళ్లతో జట్టుకు బలం పెరుగుతోంది.
ప్రపంచకప్ జట్టులో కోహ్లీ, రోహిత్ అవసరాన్ని 20 ఏళ్ల కుర్రాళ్లు కూడా అర్థం చేసుకోగలరు. నా కెరీర్లో ఇలాంటి పరిస్థితుల్లోనే నాకు అవకాశం దక్కలేదు. జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్లకు ఛాన్స్ వచ్చింది. ఇది సరైన చర్యే కాకుండా తెలివైన నిర్ణయం కూడా. అనుభవం కలిగిన ఆటగాళ్లు జట్టులో ఉంటే గతంలో మాదిరే ప్రపంచకప్ విజయం కోసం ప్రయత్నిస్తారు.
విరాట్ కోహ్లీ క్రికెట్తోనే పెరిగాడు. అలానే ముందుకు సాగుతున్నాడు. నేను కూడా అతనిలానే నా కెరీర్ ముగించాల్సింది. కోహ్లీ తన జీవితాన్ని అద్భుతంగా సమన్వయం చేసుకున్నాడు. క్రికెట్తో పాటు కుటుంబానికి తగిన సమయం ఇచ్చాడు. నేను అలా చేయలేకపోయాను. నా కెరీర్ను నేను ఇంకాస్త గొప్పగా ముగించాల్సింది.'అని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.
భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్ట్ న్యూలాండ్స్ పిచ్పై డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూలాండ్స్ పిచ్ తత్వమే అలా ఉంటుందని, తొలి రోజు కాస్త ఓపికగా బ్యాటింగ్ చేస్తే.. తర్వాత ఈజీగా ఆడవచ్చని తెలిపాడు. కానీ ఇరు జట్లు తొలి రోజు సరిగ్గా గేమ్ ప్లాన్ చేసుకోలేకపోయానన్నాడు. ఎయిడెన్ మార్క్రమ్ సెంచరీ ఇన్నింగ్స్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని చెప్పాడు.