న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడి వల్లే ప్రపంచకప్ రాలేదని సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ అన్నాడు. అసలు ప్రపంచకప్ అనేది ఏ ఒక్కడి ప్రదర్శన వల్లనో రాదని, సమష్టిగా రాణిస్తేనే విజయం దక్కుతుందని అభిప్రాయపడ్డాడు.
2011 వన్డే ప్రపంచకప్ ఘనత మహేంద్ర సింగ్ ధోనీదని అతని అభిమానులు ఇప్పటికీ అభిప్రాయపడుతారు. కానీ గౌతమ్ గంభీర్ మాత్రం సమష్టి ప్రదర్శనతోనే ఆ విజయం దక్కిందని అనేక సందర్భాల్లో పేర్కొన్నాడు. తాజాగా ఏబీ డివిలియర్స్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'క్రికెట్ను జట్టుగా ఆడాలి. ఇందులోని వ్యక్తిగత ప్రదర్శనలు కలిసే ఉంటాయి. అందరూ సమష్టిగానే ఆడితేనే విజయం దక్కుతుంది. ఇటీవల తరుచూ సోషల్ మీడియాలో ఓ కొత్త వాదన వినిపిస్తోంది.
భారత్ 2011లో ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. కేవలం మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడే కప్ను అందించలేదు. 2019లో బెన్ స్టోక్స్ మాత్రమే విజేతగా నిలపలేదు. ఇంగ్లండ్ జట్టు సమష్టిగా రాణించి ఛాంపియన్గా నిలిచింది.
ప్రతీ ఒక్కరూ ఇలానే ఆలోచించాలి. అప్కమింగ్ వన్డే ప్రపంచకప్లో భారత్ కచ్చితంగా ఫేవరేట్గా ఉంటుంది. ఈసారి మెగా టోర్నీలో అత్యధిక పరుగులు సాధించే బ్యాటర్ కూడా టీమిండియా ఆటగాడే. శుభ్మన్ గిల్ అత్యధికంగా పరుగులు సాధిస్తాడు. అతని ఫామ్ అలాంటి స్థాయిలో ఉంది.
ఓపెనర్గా రావడమూ అతనికి కలిసొచ్చే అంశం. స్వదేశంలో ఆడనుండటం గిల్కు ప్లస్. అతనిపై ఒత్తిడి కూడా భారీగానే ఉన్నా.. నా ఎంపిక మాత్రం శుభ్మన్ గిల్. అతనికి టెక్నిక్, స్టైల్ అద్భుతం. సమయానికి తగ్గట్టుగా బ్యాటింగ్లో వేగం పెంచి బౌలర్లపై ఒత్తిడి పెంచుతాడు. కుర్రాడే అయినా ఎంతో అనుభవం కలిగిన ఆటగాడిలా కనిపిస్తాడు.'అని ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.