ఐపీఎల్ 2024 వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్స్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ భారీ ధర పలకడంపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అద్భుతమైన ఆటగాళ్లే అయినా అంత ధర పెట్టి కొనాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించాడు.
దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఈ ఆసీస్ పేస్ ఆల్రౌండర్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. మిచెల్ స్టార్క్ను రూ. 24.75 కోట్ల రికార్డు ధరకు కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేయగా.. ప్యాట్ కమిన్స్ను రూ. 20.50 కోట్ల భారీ ధరకు సన్రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.

దాంతో 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా ఈ ఇద్దరూ రికార్డు నమోదు చేశారు. ఐపీఎల్ వేలం తీరుపై తాజాగా స్పందించిన ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఐపీఎల్ 2024 వేలంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్తో పాటు మరికొన్ని ఫ్రాంచైజీలు చాలా తెలివిగా వ్యవహరించాయి.
ఎలాంటి భావోద్వేగానికి గురికాకుండా తమకు కావాల్సిన ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేశాయి. భారీ ధర పలికిన ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఆటగాళ్లే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వారికి అంత ధర లభించడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వేలంలో ఫాస్ట్ బౌలర్లకు మంచి డిమాండ్ ఉన్నట్లు అనిపించింది. దీంతోనే వారి ధర అమాంతం పెరిగిపోయింది.
ఈ వేలంలో ముంబై ఇండియన్స్ నన్ను బాగా ఆకట్టుకుంది. నువాన్ తుషారా, దిల్షాన్ మదుశంక, గెరాల్డ్ కోయిట్జీ వంటి పేసర్లను తక్కువ ధరకే కొనుగోలు చేసింది. స్పిన్ విభాగంలో మహమ్మద్ నబీ, శ్రేయస్ గోపాల్లను సొంతం చేసుకుంది. బుమ్రాకు తోడుగా బౌలర్లపై ముంబై ఫోకస్ పెట్టినట్లు అనిపించింది. గెరాల్డ్ కోయిట్జీని ఆ జట్టు సొంతం చేసుకోవడం బాగుంది.
ఏడేళ్ల కిందటే కోయిట్జీ బౌలింగ్ నేను ఆడాను. అప్పుడు అతని వయసు 19 ఏళ్లే. అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఇప్పటికీ అతని బౌలింగ్ నాకు గుర్తుంది. బంతిపై పూర్తి నియంత్రణ కలిగిన పేసర్. అలాంటి బౌలర్ను ముంబై రూ. 5 కోట్లకే సొంతం చేసుకుంది.'అని ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.