ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్లకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎందుకు దూరమయ్యాడో అతని సన్నిహితుడు, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ వెల్లడించాడు. అందరూ ఊహించనట్లుగానే విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడని తెలిపాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ డెలివరీకి సిద్దంగా ఉండటంతో.. ఆమెతో గడిపేందుకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి కోహ్లీ బ్రేక్ తీసుకున్నాడని స్పష్టం చేశాడు.
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన డివిలియర్స్.. ఈ మధ్యే తనకు ఈ విషయం తెలిసిందని, కోహ్లీకి మేసేజ్ చేయడంతో చెప్పాడని తెలిపాడు. కుటుంబానికి అత్యంత ప్రాధానత్య ఇచ్చే కోహ్లీ.. బీసీసీఐ అనుమతితో ఆటకు దూరమైనట్లు తెలుస్తోంది. తొలుత ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్లకు ఎంపిక చేసిన జట్టులో విరాట్ కోహ్లీకి చోటు దక్కింది.

హైదరాబాద్ టెస్ట్ ప్రారంభానికి ముందు వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తొలి రెండు టెస్ట్లు ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. అతని వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరింది. దాంతో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్దంగా ఉందని, అతని తల్లి అనారోగ్యానికి గురైందనే ఊహాజనిత కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
తన తల్లి సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని, తప్పుడు కథనాలను ప్రచారం చేయవద్దని కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు. దాంతో కోహ్లీ గైర్హాజరీ వెనుక ఉన్న కారణంపై కాస్త క్లారిటీ వచ్చింది. తాజాగా ఏబీ డివిలియర్స్ అసలు నిజం చెప్పడంతో అందరి సందేహాలకు ఫుల్స్టాప్ పడింది.
ప్రస్తుతం కోహ్లీ ఎక్కడ? ఉన్నాడనే విషయంపై క్లారిటీ లేదు. భారత్లోనే ఉన్నాడా? లేక విదేశాల్లో ఉన్నాడనే సమాచారం లేదు. ఈ క్రమంలోనే అతను ఇంగ్లండ్తో చివరి మూడు టెస్ట్లకు కూడా దూరమవుతాడనే ప్రచారం జరుగుతోంది. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో టీమిండియా ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన హైదరాబాద్ టెస్ట్లో ఓటమికి తల వంచింది.
వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో మాత్రం తొలి రెండు రోజుల ఆటలో పై చేయి సాధించింది. యశస్వి జైస్వాల్ సూపర్ డబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్లో 143 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది.