సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో ప్రారంభించిన భారత క్రికెట్ జట్టు.. నేలకు కొట్టిన బంతిలా పుంజుకుంది. వరుస మ్యాచ్ల్లో ఓడి వన్డే సిరీస్ను చేజార్చుకున్న కోహ్లీసేన.. బ్యాక్ టు బ్యాక్ విక్టరీలతో టీ20 సిరీస్ను నెగ్గి ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా 6 వికెట్లతో ఆసీస్ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడిన స్కూప్ షాట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆండ్రూ టై బౌలింగ్లో మిస్టర్ 360, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తరహాలో విరాట్ ఆడిన ఆ స్కూప్ షాట్ ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఎంతలా అంటే స్వయంగా ఏబీ డివిలియర్సే మెచ్చుకునేంతలా ఆ షాట్ వీడియో వైరల్ అయింది.
టీమిండియా ఇన్నింగ్స్లో ఆండ్రూ టై వేసిన 15వ ఓవర్లో విరాట్ ఏబీడీ తరహాలో మోకాలిపై కూర్చొని ఫైన్ లెగ్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. ఈ అనూహ్య షాట్ను చూసి ఆసీస్ ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు అవాక్కయ్యారు. చివరకు నాన్స్ట్రైకర్గా ఉన్న హార్దిక్ పాండ్యా కూడా వావ్ అంటూ నోరెళ్ల బెట్టాడు. ఇక మ్యాచ్ అనంతరం ఈ షాట్ గురించి మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ఈ రాత్రికి ఏబీ డివిలియర్స్కు మేసేజ్ చేసి, అతని రియాక్షన్ ఏంటో తెలుసుకుంటానన్నాడు. 'ఏబీడీలా స్కూప్ షాట్ ఆడిన తర్వాత నేను అలా ఆడుతానని ఆండ్రూ టై ఏమాత్రం ఊహించి ఉండడని హార్దిక్తో చెప్పా. అతను కూడా ఏమాత్రం ఊహించలేదని చెప్పాడు. ఈ నైట్ ఈ షాట్ గురించి ఏబీడీకి మెసేజ్ చేస్తా. అతనేం అంటాడో చూస్తా'అని విరాట్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీడియోను, విరాట్ వ్యాఖ్యలను జత చేస్తూ విస్డెన్ ఇండియా ట్వీట్ చేయగా.. ఏబీడి స్పందించాడు. సూపర్ అనే ఏమోజీలతో కొనియాడాడు.
😀👌👌👌👌@imVkohli
— AB de Villiers (@ABdeVilliers17) December 6, 2020
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. తాత్కలిక సారథి మాథ్యూ వేడ్(38 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్తో 58), స్టీవ్ స్మిత్(38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46) రాణించారు. భారత బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. చాహల్, శార్ధూల్ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. శిఖర్ ధావన్(36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యా(22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్), విరాట్ కోహ్లీ(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40), కేఎల్ రాహుల్(22 బంతుల్లో 2 సిక్స్తో 30) మెరుపులు మెరిపించారు. ప్రత్యర్థి బౌలర్లలో సామ్స్, టై, స్వెప్సన్, జంపా చెరొక వికెట్ తీశారు.
రోహిత్ శర్మ లేకుండా సిరీస్ గెలవడం అద్భుతం: విరాట్ కోహ్లీ