సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కోచ్గా కెరీర్ ప్రారంభించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆటగాడిగా సుదీర్ఘ కాలం ఆ జట్టుకు సేవలందించిన డివిలియర్స్ ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. మిస్టర్ 360 ప్లేయర్గా సంచలన ప్రదర్శనలు చేశాడు. 2011లో ఆర్సీబీలో చేరిన డివిలియర్స్.. ఆ జట్టు తరఫునే రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ఆటతో భారత అభిమానుల మనసులను గెలుచుకున్నాడు.
ఐపీఎల్ 2025 సీజన్ విజయానంతరం ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో కూడా డివిలియర్స్ పాల్గొన్నాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, కోహ్లీతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై సాధించిన విజయంతో ఆర్సీబీ 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఈ క్షణాన డివిలియర్స్ కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ప్రతీ సీజన్ ముందు ఆర్సీబీలోకి ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ అనే వార్తలు వస్తుంటాయి. టీమ్ మెంటార్గా బాధ్యతలు చేపడుతాడని, బ్యాటింగ్ కోచ్గా వస్తాడని ప్రచారం జరుగుతుంటుంది.

తాజాగా ఈ విషయంపై ఏబీ డివిలియర్స్ క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా జరిపిన ఇంటరాక్షన్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఫ్యూచర్లో నేను మళ్లీ ఐపీఎల్లో భాగమయ్యే అవకాశం ఉంది. సీజన్ ఆసాంతం ప్రొఫెషనల్గా విధులు నిర్వర్తించేందుకు సిద్దంగా లేను. ఆ రోజులు ముగిసిపోయాయి. ఏదేమైనా నా మనసు ఎల్లప్పుడూ ఆర్సీబీతోనే ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ ఫ్రాంచైజీ నాకు కోచ్ లేదా మెంటార్గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తే మాత్రం స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తులో ఐపీఎల్లో పునరాగమనం చేస్తే కచ్చితంగా ఆర్సీబీతోనే ఉంటాను.'అని కోచ్గా పనిచేందుకు తనకు ఉన్న ఆసక్తిని డివిలియర్స్ వెల్లడించాడు.
ఐపీఎల్లో 184 మ్యాచ్లు ఆడిన ఏబీ డివిలియర్స్ 5162 పరుగులు చేశాడు. ఇందులో 40 హాఫ్ సెంచరీలు, మూడు శతకాలున్నాయి. 2021లో కేకేఆర్తో డివిలియర్స్ చివరగా తన ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. సౌతాఫ్రికా తరఫున 114 టెస్ట్లు, 228 వన్డేలు, 78 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 8765, 9577, 1672 పరుగులు సాధించాడు.