సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమవ్వాలని కొంతమంది కోరుకున్నారని, వారు రిటైర్మెంట్ ప్రకటించాలని భావించారని తెలిపాడు. ఈ ఇద్దరిపై అనవసరమైన నెగటివిటీని క్రియేట్ చేస్తూ విమర్శలు గుప్పించారని మండిపడ్డాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా పర్యటనతో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీ, రోహిత్ తొలి మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యారు.
కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ కాగా.. రోహిత్ తొలి మ్యాచ్లో 8 పరుగులకే ఔటయ్యాడు. ఆఖరి మ్యాచ్లో ఇద్దరూ అద్భుతమైన బ్యాటింగ్తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. రోహిత్(121) సెంచరీతో చెలరేగగా.. కోహ్లీ(74) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అయితే తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన కోహ్లీపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రిటైర్మెంట్ ప్రకటించాలనే మాటలు వినిపించాయి. ఈ విమర్శలపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఏబీ డివిలియర్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

'ప్రజలు ఏం అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. అసలు వారిని ప్రజలు అని పిలవచ్చో లేదో కూడా తెలియదు. క్రీడాకారులు తమ కెరీర్ చివరి దశకు చేరుకోగానే.. బొద్దింకల్లా బొక్కల్లో నుంచి బయటకు వచ్చినట్లు వచ్చి విమర్శలు గుప్పిస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? దేశం కోసం, క్రికెట్ కోసం తమ జీవితాన్ని ధారపోసిన ఆటగాళ్లపై ఎందుకు ఇంత నెగటివిటీని పెంచుతారు? వారిని గౌరవించుకోవడానికి ఇదే సరైన సమయం.
గత కొద్ది నెలలుగా కోహ్లీ, రోహిత్ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. కారణం ఏంటో తెలియదు కానీ ప్రతీ ఒక్కరు కోహ్లీ, రోహిత్లను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. నేను కొంతమంది గురించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను. ఎందుకంటే మెజార్టీ ప్రజలు రోహిత్, విరాట్ కోహ్లీలను ఆరాధిస్తారు. వారి అద్భుతమైన కెరీర్ను కొనియాడుతారు. వారి సక్సెస్ను సంబరాలు చేసుకుంటారు. వారి సక్సెస్ను మరోసారి సెలెబ్రేట్ చేసుకోవడానికి ఇదే అద్భుతమైన సమయం'అని ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.