ఐపీఎల్ 2024 సీజన్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతూ విమర్శలు గుప్పిస్తున్న క్రికెట్ విశ్లేషకులపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు విరాట్ కోహ్లీని విమర్శించే స్థాయి ఉందా? అని ప్రశ్నించాడు. అతను ఆడిన మ్యాచ్ల్లో సగం అయినా ఆడారా? అని నిలదీసాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీ 10 మ్యాచ్ల్లో 500 పరుగులు చేశాడు. అయితే ఆర్సీబీ మాత్రం వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చాయి. అతని స్లో బ్యాటింగ్ కారణంగానే ఆర్సీబీ విజయాలు అందుకోలేకపోయిందని కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఈ విమర్శలకు కోహ్లీ తన బ్యాట్తోనే బదులిచ్చినా.. తాజా డివిలియర్స్ ఘాటుగా స్పందించాడు.

'ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ విరాట్ కోహ్లీ. రుతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ అందుకునే వరకు విరాట్ కోహ్లీనే అగ్రస్థానంలో ఉన్నాడు. అలాంటి కోహ్లీ స్ట్రైక్రేట్పై విమర్శలు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సీజన్ ప్రారంభం నుంచి ఇవే మాటలు విని విసిగిపోయా. ఈ విమర్శలపై ఘాటుగా స్పందించాలని భావించా. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు.
అతని గణంకాలను చూస్తేనే ఈ విషయం స్పష్టమవుతోంది. కానీ అతని స్ట్రైక్రేట్ను విమర్శిస్తున్న చాలా మంది క్రికెట్ విశ్లేషకులు.. కోహ్లీ ఆడిన మ్యాచ్ల్లో పావు వంతు కూడా ఆడి ఉండరు. ఆట పట్ల వారికి సరైన అవగాహన లేదు. అసలు ఎన్ని మ్యాచ్లు ఆడారు? ఐపీఎల్లో ఎన్ని శతకాలు చేశారు?' అని డివిలియర్స్ ప్రశ్నించాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీ 10 మ్యాచ్లు ఆడి మూడు మాత్రమే గెలిచింది. అత్యంత తక్కువ రన్రేట్ ఉండటంతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది.