
మొహాలీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనో గొప్ప ప్లేయరని, విరాట్ సాధించిన ఘనతలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయన్నాడు. టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు మంగళవారం నుంచి మూడు టీ20ల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం భారత్కు వచ్చిన ఆస్ట్రేలియా.. ముమ్మరంగా సాధన చేసింది. మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుండగా.. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మీడియాతో మాట్లాడాడు.
కచ్చితమైన ప్రణాళిక ఉంటే తప్ప విరాట్తో తలపడటం అంత సులభం కాదన్నాడు. 'విరాట్ లాంటి ప్లేయర్ను ఎదుర్కోవడమంటే ధైర్యంతో కూడుకున్న పని. పదిహేనేళ్లుగా అతడు సాధించిన విజయాలు తననెప్పటికీ గొప్ప ప్లేయర్గానే గుర్తుచేస్తాయి. ముఖ్యంగా టీ20ల్లో అతడు తన ఆటతీరును మలుచుకున్న విధానం వల్ల విరాట్తో తలపడాలంటే ఎవరైనా కచ్చితమైన ప్లాన్తో వెళ్లాల్సిందే. 71 సెంచరీలు కొట్టడమేంటే నమ్మశక్యం కాని విషయం. అతడో గొప్ప ప్లేయర్..' అంటూ కొనియాడాడు. 2019 తర్వాత విరాట్ ఖాతాలో ఒక్క సెంచరీ కూడా లేదంటూ విమర్శలు ఎదుర్కొన్న ఈ పరుగుల వీరుడు ఎట్టకేలకు అఫ్గనిస్థాన్పై శతకం కొట్టిన విషయం తెలిసిందే.
జట్టులో స్టార్ ఆటగాళ్లు లేరని తమ టీమ్ను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ భారత ఆటగాళ్లను హెచ్చరించాడు. . 'మమ్మల్ని తేలికగా తీసుకోకండి. మేము ఇక్కడికి గెలిచేందుకే వచ్చాం. నిజమే.. కొంత మంది ప్లేయర్లు వివిధ కారణాలతో టీమ్కు దూరమయ్యారు. కానీ అంతమాత్రానా మా టీమ్ను లైట్గా తీసుకునే అవకాశం ఎవరికీ ఇవ్వబోం.'అని పాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఫస్ట్ టీ20 మ్యాచ్ మొహాలిలో జరగనుండగా.. ఆ తర్వాత రెండు టీ20లకి నాగ్పూర్ (శుక్రవారం), హైదరాబాద్ (ఆదివారం) ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టీ20 ప్రపంచకప్నకు ముందు బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్ను సెట్ను చేసుకోవడానికి భారత్కు మంచి తరుణం. సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకొని వచ్చాడు. అలాగే యువ బౌలర్ హర్షల్ పటేల్ కూడా జట్టుతో చేరాడు. వీరిద్దరూ టీ20 ప్రపంచకప్ జట్టులోనూ ఉన్నారు. దీంతో చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగుతున్న బుమ్రా, పటేల్ ఎలా రాణిస్తారనేది వేచి చూడాలి. ప్రపంచకప్ నాటికి బౌలింగ్ లయను అందుకోవాలని భారత్ ఆశిస్తోంది.