టీమిండియా హెడ్ గౌతమ్ గంభీర్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఆరోన్ ఫించ్ విమర్శలు గుప్పించాడు. గంభీర్ కోచింగ్ విధానం అస్సలు అర్థం కావడం లేదన్నాడు. బ్యాటింగ్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ బౌలింగ్ విభాగాన్ని విస్మరిస్తున్నాడని, అర్ష్దీప్ సింగ్ను బెంచ్కు పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ జట్టు ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. తొలి టీ20 వర్షరార్పణం కాగా.. ఈ రెండు మ్యాచ్ల్లో అర్ష్దీప్ సింగ్కు తుది జట్టులో అవకాశం దక్కలేదు.
టీ20ల్లో భారత టాప్ వికెట్ టేకర్ అయిన అర్ష్దీప్ సింగ్ను కాదని బ్యాటింగ్ చేయగలడనే కారణంతో హర్షిత్ రాణాను తుది జట్టులోకి తీసుకున్నారు. టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. కానీ ఈ ప్రయోగాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా బ్యాటింగ్ ఆర్డర్లోనూ ఆటగాళ్లతో గంభీర్ మ్యూజికల్ చైర్ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే గంభీర్ నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా గంభీర్ కోచింగ్ తీరుపై మాట్లాడిన ఆరోన్ ఫించ్ విమర్శలు గుప్పించాడు. 'గంభీర్ కోచింగ్ విధానం ఏంటో అర్థం కావడం లేదు. అర్ష్దీప్ సింగ్ను తుది జట్టులో ఆడించాలి. కనీసం మూడో టీ20లోనైనా తీసుకోవాలి. బ్యాటింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మ్యాచ్లు గెలవడం కష్టం. కానీ భారత్ ఎక్స్ట్రా బ్యాటర్తో ప్రయోగాలు చేస్తోంది.
ప్రపంచకప్ సన్నాహకల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని అర్థమవుతుంది. కానీ బౌలింగ్ విభాగం కూడా కీలకమే. మెగా టోర్నీలో విజేతగా నిలవాలంటే కేవలం బ్యాటింగ్తోనే సాధ్యం కాదు. సరైన కాంబినేషన్తో బరిలోకి దిగాలి. రెండో టీ20లో భారత బౌలర్లు తేలిపోవడానికి కారణం స్కోర్ బోర్డుపై తగినన్ని పరుగులు లేకపోవడే. భారత్ మరిన్ని పరుగులు చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. మ్యాచ్ హోరాహోరీగా సాగేది.'అని ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు. ఐదు టీ20ల సిరీస్లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. మూడో టీ20 ఆదివారం జరగనుంది.