
కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, తమ దిగ్గజ బ్యాట్స్మన్ జావెద్ మియాందాద్కు దగ్గరి పోలికలున్నాయని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అమీర్ సొహైల్ అన్నాడు. ప్రపంచ క్రికెట్లో వీరిద్దరూ పెద్ద ఆటగాళ్లైనా వ్యక్తిగతంగా మాత్రమే సక్సెస్ ఎక్కువగా అయ్యారని అభిప్రాయపడ్డాడు. ఓవరాల్గా చూస్తే జట్టుకు మాత్రం వీరి ప్రదర్శన పూర్తి స్థాయిలో ఉపయోగపడలేదన్నాడు. ప్రధానంగా మియాందాద్, కోహ్లీలు ప్రధాన టోర్నీల్లో విఫలమైన సందర్భాన్ని సొహైల్ పరోక్షంగా ప్రస్తావించాడు. తన యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు.
'ఇద్దరు పెద్ద ఆటగాళ్లే. వ్యక్తిగతంగా చాలా సక్సెస్ అయ్యారు. కానీ వీరి గొప్పతనం జట్టుకు మాత్రం ఉపయోగపడలేదు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్ర గురించి, గొప్పదనం గురించి మాట్లాడుకుంటే తొలుత వినిపించే పేరు జావెద్ మియాందాద్. అతను తన ఆట తీరుతో పాకిస్తాన్ క్రికెట్ను ఉన్నత శిఖరంలో నిలబెట్టాడనేది కాదనలేని వాస్తవం. అతనితో భారీ భాగస్వ్యామాల్లో పాలుపంచుకుంటే ఎంతో నేర్చుకోవచ్చు. అతని స్పూర్తిదాయకమైన ఆటతో మరెంతో మెరుగవచ్చు. కోహ్లీ కూడా అలానే ఇతరులకు స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. తన ఆటతీరుతో చుట్టూ ఉన్న ఆటగాళ్లను ప్రభావితం చేస్తున్నాడు. ఇలానే గ్రేట్ ప్లేయర్ అనే ట్యాగ్ను సంపాదించుకున్నాడు'అని సొహైల్ చెప్పుకొచ్చాడు.
ఇక కోహ్లీలో దూకుడు, బ్యాటింగ్లో ఆకట్టుకునే నైజం జట్టులో భాగమైపోయాయన్నాడు. ఆటే జీవితం అనే విషయాన్ని విరాట్ తొందరగా తెలుసుకున్నాడు కాబట్టి ఆ గేమ్ అతన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టిందని విశ్లేషించాడు. సాధ్యమైనంతవరకూ ప్రొఫెషనల్ కెరీర్ను వ్యక్తిగత జీవితాన్ని దూరంగా ఉంచుతాడు కాబట్టే కోహ్లీ గ్రేట్ ప్లేయర్గా ఎదిగాడని చెప్పుకొచ్చాడు.
1975లో పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మియందాద్.. 124 టెస్టుల్లో 8832, 233 వన్డేల్లో 7381 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ వన్డేల్లో ఇప్పటికే 11 వేల పరుగులు పూర్తి చేయగా.. టెస్ట్ల్లో 7వేలకు పైగా రన్స్ చేశాడు. ఇదే ఫామ్ను కొనసాగిస్తే భవిష్యత్తులో అతను మరిన్నీ రికార్డులను బద్దలు కొట్టగలడు.