
సిడ్నీ: కరోనా వైరస్ కారణంగా భారత్-ఆస్ట్రేలియా మహిళల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దయింది. షెడ్యూల్ ప్రకారం జనవరిలో జరగాల్సిన ఈ సిరీస్ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) వాయిదా వేసింది. ఆస్ట్రేలియాలో మళ్లీ కరోనా విస్తరిస్తుండటంతో రిస్క్ ఎందుకని సీఏ ఈ వన్డే సిరీస్ను వచ్చే సీజన్కు వాయిదా వేసింది.
'భారత్-ఆస్ట్రేలియా మహిళల మధ్య జనవరిలో జరగాల్సిన మూడు వన్డేల కామన్వెల్త్ బ్యాంక్ వన్డే సిరీస్ను వచ్చే సీజన్కు వాయిదా వేసాం. తదుపరి సీజన్లో మూడు టీ20ల సిరీస్ను కూడా జత చేసి భారత మహిళల పర్యటనను విస్తరిస్తాం.'అని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే ఈ నిర్ణయంపై ఆకాశ్ చోప్రా అభ్యంతరం వ్యక్తం చేశాడు. సీఏపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పరుషులు క్రికెట్కు అడ్డురాని కరోనా మహిళల క్రికెట్కు మాత్రమే వస్తుందా? అని ప్రశ్నించాడు. ఇది ముమ్మాటికి మహిళల క్రికెట్ పట్ల ఉన్న వివక్షేనని, ప్రపంచ క్రికెట్లోకి వారికి సమన్యాయం దక్కడం లేదన్నాడు. 'ఇదేక్కడి న్యాయం? పురుషుల క్రికెట్ ఓ దిక్కు జరగుతుండగా.. మహిళలు మాత్రం క్రికెట్ ఆడలేరా? జెండర్ సమన్యాయం ఎక్కడా?'అని చోప్రా ట్వీట్ చేశాడు.
కరోనాతో సావాసం చేస్తూ పురుషుల అంతర్జాతీయ క్రికెట్ మొదలైనా మహిళల క్రికెట్ మాత్రం ఇంకా మొదలవ్వలేదు. కానీ మహిళల టీ20 చాలెంజర్స్ పేరిట బీసీసీఐ మహిళల క్రికెట్ అభివృద్దికి కృషి చేసింది. కానీ పరుషుల క్రికెట్ ఏర్పాటు చేసిన సిరీస్ల్లో సగం కూడా మహిళల కోసం చొరవ చూపలేకపోయింది.