సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగే రెండు టెస్ట్ల సిరీస్లో టీమిండియా రిషభ్ పంత్తో పాటు ధ్రువ్ జురెల్ను కూడా ఆడించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. ప్రస్తుతం ధ్రువ్ జురెల్ సూపర్ ఫామ్లో ఉన్నాడని, సౌతాఫ్రికాతో అనధికార టెస్ట్ సిరీస్లో సెంచరీతో సత్తా చాటాడని, వెస్టిండీస్పై కూడా శతకం బాదాడని గుర్తు చేశాడు. ధ్రువ్ జురెల్ను బ్యాటర్గా ఆడించాలని అభిప్రాయపడ్డాడు.
రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా నవంబర్ 14న కోల్కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, ధ్రువ్ జురేల్ ఇద్దరూ వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. అయితే వీరిద్దరూ తుది జట్టులో ఉంటే బాగుంటుందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా టీమ్ కాంబినేషన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ ఇద్దరూ జట్టులో ఉన్నారు. వైస్ కెప్టెన్గా రిషభ్ పంత్కు తుది జట్టులో చోటు దక్కుతుంది. అయితే ధ్రువ్ జురేల్కు కూడా అవకాశం ఇవ్వాలి. ధ్రువ్ జురెల్ను ఆడించాలంటే సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డిలో ఒకరు బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. సాయి సుదర్శన్ను ఫస్ట్ డౌన్లో ఆడించి ఫామ్లో లేని నితీష్ కుమార్ రెడ్డిపై వేటు వేయాలి.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
ధ్రువ్ జురెల్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. గత నెలలో వెస్టిండీస్తో తొలి టెస్ట్లో 125 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ఏతో భారత్-ఏ తరఫున 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. రిషభ్ పంత్ గైర్హాజరీలో వెస్టిండీస్తో ఆడిన ధ్రువ్ జురెల్కు అతని రాకతో తుతి జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారింది.