ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. 'ముంబైకా రాజా.. కబ్ బజాయెగ బాజా(ముంబై రాజు.. ఎప్పుడు ఆడుతాడు?)'అని ప్రశ్నించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో గురువారం జరిగిన మ్యాచ్లో రెండు భారీ సిక్సర్లతో ఆశలు రేకెత్తించిన హిట్ మ్యాన్.. ఫుల్ టాస్ బాల్కు క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. 16 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి 13.66 యావరేజ్తో 82 పరుగులే చేశాడు.
రోహిత్ ఎప్పుడు ఆడుతాడు..?
ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 4 వికెట్లతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి మాట్లాడిన ఆకాశ్ చోప్రా తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. 'ముంబై బ్యాటింగ్లో మళ్లీ ఆ ప్రశ్న అలానే మిగిలిపోయింది. 'ముంబైకా రాజా.. కబ్ బజాయెగ బాజా?'. ఇది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. రోహిత్ వైఫల్యం మాత్రం కొనసాగుతోంది. ఎడ్జ్తో లక్కీగా సిక్స్ రాబట్టిన రోహిత్.. ఆ తర్వాత రెండు అద్భుతమైన సిక్సర్లు కొట్టాడు. భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. కానీ ఫుల్టాస్ బాల్కు ఔటయ్యాడు.

16వ ఓవర్లోనే ముగించాల్సింది..
తొలి మ్యాచ్ నుంచి ప్రతీ మ్యాచ్లో రోహిత్ కొన్ని పరుగులు ఎక్కువగానే చేస్తున్నాడు. కానీ ఇప్పటికే చాలా ఇన్నింగ్స్లు ఆడాడు. రోహిత్ శర్మ అభిమానులు ఆశించిన విధంగా బ్యాటింగ్ చేయడం లేదు. ర్యాన్ రికెల్టన్, సూర్య కొన్ని షాట్స్ ఆడి ఔటయ్యారు. వీరి మధ్య విల్ జాక్స్ విలువైన పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్ నాకు అస్సలు అర్థం కాలేదు. 16వ ఓవర్లోనే ముగించాల్సిన మ్యాచ్ను 19వ ఓవర్ వరకు తీసుకెళ్లారు. బౌండరీలు బాది ఈజీగా మ్యాచ్ను ముగించాల్సింది. కానీ ముంబై ఆటగాళ్లు ఫుల్టాస్లకు ఔటవ్వడం ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు.
హార్దిక్ కెప్టెన్సీ అర్థం కాలేదు..
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కూడా ఆశ్చర్యంగా అనిపించింది. స్పిన్కు అనుకూలంగా ఉన్న వికెట్పై విల్ జాక్స్ తన పూర్తి కోటాను బౌలింగ్ చేయలేదు. కీలక వికెట్లు తీసినా అతనికి మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు. మిచెల్ సాంట్నర్ ఒకే ఒక్క ఓవర్ వేసాడు. ఇద్దరు స్పిన్నర్లు కలిసి 4 ఓవర్లు వేస్తే.. ధారళంగా పరుగులిచ్చిన దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యాలు పూర్తి కోటా బౌలింగ్ చేయడం ఏంటో అర్థం కాలేదు. ఈ ఇద్దరే 40 ప్లస్ రన్స్ సమర్పించుకున్నారు. 15 ఫుల్టాస్లు వేసినా బౌండరీ రాలేదు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.