న్యూఢిల్లీ: స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను వాడుకోవడం పంజాబ్ కింగ్స్ చేత కాలేదని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలోనూ అర్ష్దీప్ సింగ్ బౌలింగ్ ఇవ్వడం లేదన్నాడు. ఇలా చేయడానికి గల కారణాన్ని వెల్లడించాలని పంజాబ్ కింగ్స్ టీమ్మేనేజ్మెంట్ను ప్రశ్నించాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పేలవ బౌలింగ్తో పాటు టీమ్మేనేజ్మెంట్ చెత్త నిర్ణయాలు ఆ జట్టు ఓటమికి కారణమయ్యాయి. ఈ ఓటమితో పంజాబ్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.

సీజన్ ఆరంభంలో సంచలన బౌలింగ్తో పర్పుల్ క్యాప్ రేసులో నిలిచిన అర్ష్దీప్ సింగ్ ఆ తర్వాత పేలవ ప్రదర్శన కనబర్చాడు. కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో అద్భుతంగా వేసే అర్ష్దీప్ సింగ్ను పంజాబ్ కింగ్స్ సరిగ్గా వాడుకోకపోవడంతోనే అతను వికెట్లు తీయలేకపోయాడు. పూర్తి కోటా ఓవర్లు కూడా ఇవ్వలేదు. ఇదే విషయాన్ని ఆకాశ్ చోప్రా ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు.
'అర్ష్దీప్ సింగ్ ఈ సీజన్ను అద్భుతంగా ప్రారంభించాడు. సూపర్ బౌలింగ్తో పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. తర్వాత ఏమైందో ఏమో కానీ అతనికి కొత్త బంతితో బౌలింగ్ ఇవ్వలేదు. డెత్ ఓవర్లలో కూడా వేయించలేదు. ఇది కెప్టెన్సీ నిర్ణయం అయితే కాదు. పంజాబ్ కింగ్స్ టీమ్మేనేజ్మెంట్ సమాధానం చెప్పాలి.'అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.

ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కెప్టెన్గా తాను చేసిన తప్పిదం ఓటమికి కారణమైందని పంజాబ్ సారథి శిఖర్ ధావన్ అంగీకరించాడు. చివరి ఓవర్ను స్పిన్నర్తో వేయించడం తమ ఓటమిని శాసించిందని తెలిపాడు. 'ఈ ఓటమి చాలా అసహనానికి గురి చేసింది. పవర్ ప్లేలో మేం సరిగ్గా బౌలింగ్ చేయలేదు. బంతి స్వింగ్ అయినప్పుడు మేం వికెట్లు తీయాల్సింది.
లివింగ్ స్టోన్ అద్భుతంగా ఆడాడు. కానీ దురదృష్టవశాత్తు విజయాన్ని అందుకోలేకపోయాం. చివరి ఓవర్ను స్పిన్నర్తో వేయించి నేను ఘోర తప్పిదం చేశాను. అంతకుముందు మా పేసర్లు సరైన లెంగ్త్లో బౌలింగ్ వేయకుండా 18-20 పరుగులు సమర్పించుకున్నారు. ఆ రెండు ఓవర్లు మా పతనాన్ని శాసించాయి.'అని ధావన్ చెప్పుకొచ్చాడు.