టీమిండియా మేనేజ్మెంట్పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. జట్టులో ప్రయోగాలు చేయడం ఆపరా? అని ప్రశ్నించాడు. బ్యాటర్లతో మ్యూజికల్ చైర్ ఆడటం సరికాదని అభిప్రాయపడ్డాడు. రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. స్పెషలిస్ట్ బ్యాటర్ సాయి సుదర్శన్ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ను తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు.
మూడో స్థానంలో మ్యూజికల్ చైర్ ఆడటం సరికాదన్నాడు. సాయి సుదర్శన్ను తుది జట్టులో ఆడించలేనప్పుడు జట్టులోకి ఎందుకు తీసుకున్నారు? అని ప్రశ్నించాడు.

'ఢిల్లీలో అతను ఆడిన ఇన్నింగ్స్ విషయంలో సంతృప్తిగా లేనప్పుడు జట్టులోకి ఎందుకు తీసుకున్నారు. జట్టులో 15 మంది సభ్యులు ఉండాలని సాయి సుదర్శన్ను తీసుకోవడం సరికాదు. మూడో స్థానంలో విపరీతమైన ప్రయోగాలు చేయడం ఆపరా? ఎవరైనా ఆటగాడు స్క్వాడ్లో ఉండి, తుది జట్టులో లేకుంటే.. అతనిలో నైపుణ్యం లేదని కాదు. ఆటగాళ్లను సన్నద్ధులను చేయడంలో తప్పులేదు. కానీ.. మూడో స్థానాన్ని మ్యూజికల్ ఛైర్లా మార్చకూడదు. ఇంతకుముందు కరుణ్ నాయర్ ఆడాడు. తర్వాత అభిమన్యు ఈశ్వరన్ను ఆడిస్తారేమో'అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఆడించడంపై అనిల్ కుంబ్లే కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. జట్టులో స్పెషలిస్ట్ బ్యాటర్లు ముగ్గురు మాత్రమే ఉన్నారని, ఆల్రౌండర్లతోనే జట్టు నిండిపోయిందన్నాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియా ఇదే ఫార్మూలాను అనుసరిస్తుందని చెప్పాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 55 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. జస్ప్రీత్ బుమ్రా(5/27) ఐదు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/47), కుల్దీప్ యాదవ్(2/36) రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.