
హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో అద్భుత విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్ను 2-1తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో భారత ఆటగాళ్లు ఫీల్డింగ్లో అదరగొట్టారు. కళ్లుచెదిరే క్యాచ్లు.. అద్భుత రనౌట్లు.. సూపర్ స్టంపౌట్లతో ఆకట్టుకున్నారు.
రాజ్కోట్లో మనీష్ పాండే వన్ హ్యండెడ్ క్యాచ్... బెంగళూరులో విరాట్ డైవ్ క్యాచ్ సిరీస్కే హైలైట్. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్ చేశాయి. అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కూడా కురిపించారు. ఈ నేపథ్యంలోనే కామెంటేటర్గా అవతారమెత్తిన మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా కోహ్లీ క్యాచ్ను కొనియాడుతూ ట్వీట్ చేశాడు.
'వాటే క్యాచ్.. మార్నస్ లబుషేన్ అద్భుత ఇన్నింగ్స్ మాదిరే'అంటూ కోహ్లీ క్యాచ్ను కొనియాడాడు. ఈ ట్వీట్కు చిర్రెత్తిన ఓ అభిమాని'హలో విరాట్ కోహ్లీ చమ్చా... గత మ్యాచ్లో పాండే అద్భుత క్యాచ్ను ఎందుకు ట్వీట్ చేయలేదు'అని ఘటుగా ప్రశ్నించాడు. దీనికి చోప్రా అదే రీతిలో సమాధానం ఇచ్చాడు.
'అయ్యా క్షమించండి. ఇక నుంచి ఈ ఏడాదికి సంబంధించిన ప్రతీ క్యాచ్ను ట్వీట్ చేస్తానని మాటిస్తున్నా. ఇక పాండే క్యాచ్ పట్టినప్పుడు నేను కామెంట్రీ చెబుతున్నా. అప్పుడే ఆ క్యాచ్ను ప్రశంసించా. కామెంట్రీ చెబుతున్నప్పుడు ట్వీట్ చేయలేం కదా' అని చోప్రా ఆ అభిమాని నోరుమూయించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఇక మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన ఆసీస్ యంగ్ బ్యాట్స్మన్ లబుషేన్ను ఫార్వార్డ్ ఫీల్డర్గా ఉన్న కోహ్లీ అద్భుత డైవ్తో పెవిలియన్ చేర్చిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో పాండే ఒంటిచేత్తో బంతిని అందుకొని వార్నర్ను పెవిలియన్కు చేర్చాడు.
షమీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ రెండో బంతిని వార్నర్ ఆఫ్ సైడ్కు హిట్ చేయగా.. మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న పాండే అద్భుతంగా అందుకున్నాడు. తలపై నుంచి వెళ్లిపోతున్న బంతిని పాండే మెరుపు వేగంతో ఎగిరి పట్టుకున్నాడు.