
లక్ష్మీబాంబులా పేలిన రోహిత్-రాహుల్..
ఈ మ్యాచ్లో మళ్లీ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' రోహిత్ శర్మ (47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 74), కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 69) చెలరేగారు. రిషభ్ పంత్ (13 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 27 నాటౌట్), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 35 నాటౌట్) మెరుపులు మెరిపించారు. తర్వాత అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులే చేసి ఓడింది. కరీమ్ జనత్ (22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 42), కెప్టెన్ నబీ (32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 35) మెరుగ్గా ఆడారు.

కోహ్లీ చేసిన సరదా వ్యాఖ్యలతో..
ఈ భారీ విజయంతో టీమిండియా నెట్ రన్రేట్ను మెరుగుపర్చుకుని మళ్లీ సెమీస్ రేసులో నిలిచింది. అయితే పాకిస్థాన్.. న్యూజిలాండ్ జట్లపై వరుసగా టాస్ ఓడిపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అఫ్గానిస్థాన్ మ్యాచ్లోనూ టాస్ ఓడిపోయాడు. రాత్రి మ్యాచ్ల్లో మంచు ప్రభావం ఉన్న నేపథ్యంలో టాస్ గెలిచిన జట్లు ఏ మాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ తీసుకొని విజయాలందుకుంటున్నారు. గత రెండు మ్యాచ్ల్లో భారత ఓటమికి టాస్ ఓడిపోవడం ముఖ్యం కారణమైంది. ఈ క్రమంలోనే బుధవారం మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ కెప్టెన్ మహ్మద్ నబీ తన నిర్ణయం చెప్పేందుకు మ్యాచ్ ప్రజెంటర్ సమీపానికి వెళ్తుండగా.. అతనికి కంగ్రాట్స్ చెప్పిన విరాట్ కోహ్లీ.. 'మీరు మొదట బౌలింగ్ చేయబోతున్నారా..?'కదా ప్రశ్నించాడు.

ప్రలోభాలకు గురి చేశాడని..
దానికి అవునన్నట్లుగానే నబీ 'మేము మొదట బౌలింగ్ చేస్తాం' అని మ్యాచ్ ప్రజెంటర్తో చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియోను వైరల్ చేస్తున్న పాక్ నెటిజన్లు.. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అఫ్గానిస్థాన్ కెప్టెన్ మహ్మద్ నబీని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రలోభానికి గురి చేశాడని వాదిస్తున్నారు. అలానే ఫీల్డింగ్, బౌలింగ్లోనూ అఫ్గానిస్థాన్ పేలవ ప్రదర్శనకు తమ టీమ్మేనేజ్మెంట్ వచ్చిన ఆదేశాలనేనని, నబీసేన అమ్ముడుపోయిందని కామెంట్ చేస్తున్నారు. మాములు అభిమానులే కాకుండా సెలెబ్రేటీలు సైతం ఇవే ఆరోపణలు చేస్తున్నారు.

కౌంటరిచ్చిన ఆకాశ్ చోప్రా..
పాకిస్థాన్ టీవీ నటి సెహర్ షిన్వారి ఈ మ్యాచ్ ఫలితంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మ్యాచ్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొనుగోలు చేసిందని అర్ధం వచ్చేలా ట్వీట్ చేసింది. భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా మ్యాచ్ అనంతరం చేసిన ట్వీట్కు బదులుగా ఆమె రీ ట్వీట్ చేసింది. అఫ్గాన్పై విజయానంతరం టీమిండియాకు విషెష్ తెలుపుతూ "భారత్.. భారత్లా ఆడిందంటూ" ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. అయితే, ఆకాశ్ చేసిన ట్వీట్ను ట్యాగ్ చేస్తూ రిప్లై ఇచ్చిన పాక్ నటి.. "ఓ మంచి మ్యాచ్ను బీసీసీఐ కొనుగోలు చేసింది" అంటూ రీ ట్వీట్ చేసింది. సెహర్ షిన్వారి చేసిన వ్యాఖ్యలకు ఆకాష్ చోప్రా తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. "వక్రబుద్ది గల మనుషుల నుంచి ఇలాంటి నెగిటివ్ మాటలే వస్తాయి" అంటూ కౌంటర్ ఇచ్చాడు.

విజయాన్ని జీర్ణించుకోలేక..
వాస్తవానికి అఫ్గానిస్థాన్పై మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఉంటే..? తొలుత బౌలింగ్ చేసేందుకే మొగ్గు చూపేది. ఈ విషయాన్ని టాస్ సమయంలో విరాట్ కోహ్లీ కూడా వెల్లడించాడు. అలాంటప్పుడు నబీని ఫస్ట్ బౌలింగ్ చేయమని ప్రలోభానికి గురి చేయాల్సిన అవసరం కోహ్లీకి లేదు. యూఏఈ పిచ్లు చేజింగ్కు అనుకూలంగా ఉండటం, వరుసగా టాస్లు ఓడిపోయిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ చేసిన సరదా వ్యాఖ్యలను ఫిక్సింగ్కు సాక్ష్యాలని చూపించడం తగదని, టీమిండియా విజయాన్ని పాక్ అభిమానులు.. వివాదాస్పదరీతిలో ట్రోల్ చేస్తున్నారని భారత అభిమానులు కౌంటరిస్తున్నారు.


Click it and Unblock the Notifications
