
న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి కరోనా సోకిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా అస్వస్థతకు లోనైన అతను శనివారం పరీక్షలు నిర్వహించుకోగా పాజిటీవ్ వచ్చింది. ఈ విషయాన్ని అఫ్రిదినే ట్వీటర్ వేదికగా తెలియజేశాడు. తాను కోలుకోవడానికి అందరి ప్రార్థనలు కావాలని, అందరూ ఇంట్లోనే క్షేమంగా ఉండాలని సూచించాడు.
ఇక అఫ్రిదికి కరోనా సోకడంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్కు గురైంది. ఈ లెజండరీ క్రికెటర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. అయితే అఫ్రిది పాపం పండింది కాబట్టే కరోనా సోకిందని కొంతమంది భారత అభిమానులు అతనిపై వారికున్న ఆగ్రహాన్ని సోషల్ మీడియావేదికగా వెళ్లగక్కారు. భారత్ పట్ల విద్వేశంతో రగిలిపోతున్నాడు కాబట్టే మహమ్మారి బారిన పడ్డాడని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇక ఈ వ్యాఖ్యల పట్ల భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు మనుషులకు మానవత్వం, సున్నితత్వం అనేది ఉందా? అని ప్రశ్నించాడు. అక్తర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. 'అఫ్రిది తాను చేసిన పాపాలకు శిక్షను అనుభవిస్తున్నాడు'అని హిందీలో ఉన్న ఓ యూట్యూబ్ హెడ్లైన్ స్క్రీన్ షాట్ను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.'మనం ఇంత కఠినంగా తయారయ్యామా? సున్నితత్వం, మానవత్వం అనేవి లేవా? అఫ్రిది త్వరగా కోలుకోవాలి. ఆ శక్తిని దేవుడు అతనికివ్వాలి'అని క్యాప్షన్గా పేర్కొన్నాడు.
కరోనా కష్టకాలంలో అఫ్రిది తన ఫౌండేషన్ ద్వారా పేదప్రజలకు అండగా నిలిచాడు. దేశం మొత్తం తిరుగుతూ నిత్యవసర సరుకులు అందజేశాడు. ఈ క్రమంలోనే అతను కరోనా బారిన పడిఉంటాడని అందరూ భావిస్తున్నారు.