
న్యూఢిల్లీ: టాపార్డర్ బ్యాట్స్మన్ పైనే టీమిండియా పూర్తిగా ఆధారపడుతోందని మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ రాణించకుంటే అందరూ విఫలమవుతున్నారని అభిప్రాయపడ్డాడు. ఇలా అయితే కష్టమేనని, అందరూ బాధ్యతాయుతంగా ఆడాలన్నాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా భారత బ్యాటింగ్ను విశ్లేషించిన ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'పరిమిత ఓవర్లలో ఆటగాడు వ్యక్తిగతంగా చేసే స్కోరే చాలా కీలకం. కానీ, టీమిండియా టాపార్డర్పై ఎక్కువగా ఆధారపడుతోంది. రోహిత్, రాహుల్ బాగా ఆడితే భారీ లక్ష్యం నమోదు చేసి టీమ్ గెలుస్తోంది. కోహ్లీ విషయంలోను ఇదే వర్తిస్తుంది." అని చోప్రా చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్ టోర్నీలో తొలి రెండు మ్యాచ్ల్లో టాపార్డర్ విఫలమైన కారణంగా భారత్ ఓటమి పాలైందన్నాడు. అఫ్గానిస్థాన్తో టాపార్డర్ బ్యాటర్లు కళ్లు చెదిరే బ్యాటింగ్ చేశారు కాబట్టి భారత జట్టు విజయం సాధించిందని పేర్కొన్నాడు. ఇలా టాపార్డర్ ముగ్గురు లేదా ఐదుగురు ఆటగాళ్లే రాణించాలనే ధోరణి మారాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. టీ20ల్లో ప్రతిసారి దాదాపు 200 పరుగుల లక్ష్యం పెట్టే సత్తా టీమిండియాకు ఉందని అకాశ్ అన్నాడు. కానీ, ఆ స్థాయిలో టీమిండియా ప్రతిభ కనబరచడం లేదని తెలిపాడు. జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు వ్యక్తిగతంగా ఎక్కువ స్కోరు నమోదు చేసే అలవాటు చేసుకోవాలని సూచించాడు.
టీ20 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన శ్రీలంక యువ క్రికెటర్ చరిత్ అసలంకపై ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. రానున్న ఐపీఎల్ వేలంలో అసలంక కోసం ఫ్రాంఛైజీలు తప్పక ఆసక్తి చూపుతాయని వ్యాఖ్యానించాడు. 'టీ20 వరల్డ్కప్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న చరిత్ అసలంకను దక్కించుకునేందుకు.. వేలంలో ఐపీఎల్ జట్లు ఆసక్తి కనబరుస్తాయని భావిస్తున్నాను'అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. ఇక ఈ ప్రపంచకప్లో క్వాలిఫయర్స్ మ్యాచ్లలో వరుస విజయాలు నమోదు చేసి సూపర్ 12 కు అర్హత సాధించిన శ్రీలంక జట్టు.. సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. సూపర్ 12 రౌండ్లో 5 మ్యాచ్లలో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి నాకౌట్ దశలోనే వెనుదిరిగింది.