టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. హార్దిక్ పాండ్యాలా బంతితో పాటు బ్యాట్తో రాణించే ఆటగాడు ఈ ప్రపంచంలోనే లేడని కొనియాడాడు. అతను లేకుంటే టీమిండియా కాంబినేషన్ అసంపూర్ణమని అభిప్రాయపడ్డాడు.
హార్దిక్ పాండ్యాతోనే టీమిండియాకు సరైన కాంబినేషన్ లభిస్తుందని తెలిపాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు టీమిండియా తమ చివరి ద్వైపాక్షిక టీ20 సిరీస్కు సిద్దమైంది. న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో బరిలోకి దిగనుంది. టీమ్ కాంబినేషన్ను ఫైనల్ చేసేందుకు మేనేజ్మెంట్ ఈ సిరీస్ను వాడుకోనుంది.
ఈ సిరీస్ నేపథ్యంలోనే తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. టీమిండియాకు హార్దిక్ పాండ్యా ఎంత కీలకమో వివరించాడు. 'హార్దిక్ పాండ్యా లేకుంటే టీమిండియా కాంబినేషన్ అసంపూర్ణంగా ఉంటుంది. ఈ ప్రపంచంలోనే హార్దిక్ లాంటి ఆటగాడు మరొకరు లేరు. బ్యాట్తో పాటు బంతితో ఈ దేశంలోనే మరెవరూ రాణించలేరు.

హార్దిక్ పాండ్యా కొత్త బంతితో బౌలింగ్ చేయగలడు. అలాగే డెత్ ఓవర్లలో కూడా జట్టుకు ఉపయోగపడగలడు. వరుణ్ చక్రవర్తీ లేదా కుల్దీప్ యాదవ్ను తుది జట్టులో ఆడించాలనుకుంటే.. అప్పుడు 8వ స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడు కూడా కావాలి. ఇలా అన్ని కావాలంటే కుదరదు. ఎందుకంటే 12 మంది ఆటగాళ్లను ఆడించలేం. కేవలం హార్దిక్ పాండ్యా మాత్రమే ఈ లోటును భర్తీ చేయగలడు. అతను కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలోనూ తన బౌలింగ్తో ప్రభావం చూపగలడు.
భారత్ గెలిచిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లోనూ ఆఖరి ఓవర్ను హార్దిక్ పాండ్యానే వేశాడు. హార్దిక్ ఒక్కడే ఇలా చేయగలడు. అతనిలాంటి ఆటగాడు మరెక్కడా దొరకడు. న్యూజిలాండ్తో సిరీస్ భారత్కు చాలా కీలకం. న్యూజిలాండ్ కూడా పూర్తి సన్నద్దతతో వచ్చింది. వన్డే సిరీస్కు కొందరు ఆటగాళ్లు దూరంగా ఉన్నా.. టీ20 సిరీస్లో మాత్రం పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతుంది. వారి ప్రధాన టీ20 ప్రపంచకప్ జట్టు ఆడుతోంది.
టీమిండియా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతారా? వారికి ఏ బ్యాటర్లు అవసరం? తిలక్ వర్మ ఫిట్గా ఉంటే.. రింకూ సింగ్కు అవకాశం ఇస్తారా? శ్రేయస్ అయ్యర్నే కొనసాగిస్తారా? అనే ప్రశ్నలకు ఈ సిరీస్లో సమాధానాలు రాబట్టాల్సి ఉంది.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.