
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపుతున్న భారత బౌలర్లపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ప్రస్తుతమున్న బౌలింగ్ దళం అత్యుత్తమమైనదని కొనియాడాడు. ఇటీవల లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్ట్లో భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో భారత బౌలర్లు కీలక పాత్ర పోషించారు. వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్లో విలువైన పరుగులు జోడించి ఓటమి అంచున చేరిన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ఈ క్రమంలోనే భారత బౌలింగ్ దళంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది.
ఈ విజయంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన చోప్రా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ప్రస్తుతం టీమిండియాకున్న బౌలింగ్ లైనప్ భారత టెస్టు క్రికెట్లోనే అత్యుత్తమమైనది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మేం క్రికెట్ ఆడుతున్న సమయంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్లాంటి దిగ్గజ స్పిన్నర్లు ఉన్నప్పటికీ నలుగురు లేదా ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు లేరు. హర్భజన్సింగ్, జహీర్ఖాన్, అనిల్ కుంబ్లే వంటి బౌలర్లు జట్టు కోసం ఎన్నో అద్భుతాలు చేశారు.
కొంత కాలం జహీర్ఖాన్, అజిత్ అగార్కర్, ఆశిష్ నెహ్రా, ఆర్పీ సింగ్ వంటి బౌలర్లు రాణించినప్పటికీ.. ఇప్పుడు ఉన్న విధంగా బౌలింగ్ లైనప్ లేదు. ప్రస్తుతం బుమ్రా, షమీ, ఇషాంత్, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ వంటి బౌలర్లతో బౌలింగ్ దళం పటిష్టంగా ఉంది. స్పిన్నర్ల విషయానికొస్తే..హర్భజన్సింగ్ పాత్రను రవిచంద్రన్ అశ్విన్ పోషిస్తుండగా..అనిల్ కుంబ్లే వంటి బౌలర్ రవీంద్ర జడేజా రూపంలో ఉన్నాడు. కాబట్టి భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంతకన్నా మెరుగైన బౌలింగ్ లైనప్ ఉందని అనుకోను' అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 364 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 391 రన్స్ చేసి 27 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. సెకండ్ ఇన్నింగ్స్లో 194 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా 9వ వికెట్కు అజేయంగా 89 పరుగులు జోడించి గట్టెక్కించారు. దాంతో కోహ్లీసేన 298/8 వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 120 పరుగులకే కుప్పకూలి చిత్తయింది. ఫస్ట్ మ్యాచ్లోనూ 20 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు.. తాజా మ్యాచ్లోనూ దుమ్ములేపారు. మూడో టెస్ట్ ఆగస్టు 25 నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభం కానుంది.