టీ20 ప్రపంచకప్ ముందు తాము ఆడిన చివరి ద్వైపాక్షిక సిరీస్ను టీమిండియా ఘనంగా ముగించింది. అఫ్గానిస్థాన్తో మూడు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. చిన్న స్వామి స్టేడియంలో బుధవారం ఉత్కంఠగా జరిగిన చివరి టీ20లో రోహిత్ సేన రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్లో టీమిండియా రూల్స్కు విరుద్దంగా వ్యహరించిందని, అంపైర్ల తప్పిదం అఫ్గానిస్థాన్ కొంపముంచిందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. మ్యాచ్ సమయంలోనే కామెంటేటర్గా తాను ఈ విషయాన్ని చెప్పానని తెలిపాడు. ఈ మ్యాచ్ ఫలితంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. నిబంధనలకు విరుద్దంగా రోహిత్ శర్మ రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేశాడని తెలిపాడు.

తొలి సూపర్ ఓవర్లో రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగినా రోహిత్ శర్మను రెండో సూపర్ ఓవర్లో ఆడించడం నిబంధనలకు విరుద్దమని తెలిపాడు. 'రోహిత్ శర్మ రిటైర్డ్ ఔటయ్యాడు. రిటైర్డ్ హర్ట్ అయితే మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. మైదానంలో గాయపడినప్పుడు రిటైర్డ్ హర్ట్గా వెళ్తే మళ్లీ బ్యాటింగ్ చేసేందుకు అంపైర్లు అనుమతిస్తారు.
కానీ రిటైర్డ్ ఔట్ అంటే బ్యాటింగ్ను ముంగించుకోవడమే. మళ్లీ బ్యాటింగ్ చేయడానికి వీలు లేదు. రోహిత్ శర్మ రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగినప్పుడే నేను కామెంట్రీలో అతను మళ్లీ బ్యాటింగ్ రాలేడని చెప్పాను. ఎందుకంటే అతను ఔటయ్యాడు. కానీ రింకూ సింగ్, రోహిత్ శర్మ బ్యాటింగ్కు దిగారు. ఇది ఘోర తప్పిదం. రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగిన రోహిత్ శర్మను మళ్లీ బ్యాటింగ్ పంపించడం రూల్స్కు విరుద్దం.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
రెండో సూపర్ ఓవర్లో శివమ్ దూబేకు బదులు సంజూ శాంసన్ను బ్యాటింగ్ పంపించడం తనను షాక్కు గురి చేసిందని ఆకాశ్ చోప్రా తెలిపాడు. 'రింకూ సింగ్ ఔటైన వెంటనే సంజూ శాంసన్ బ్యాటింగ్కు రావడం చూసి షాకయ్యా. సంజూకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. కానీ అతను అప్పటికే గోల్డెన్ డక్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే ఔటవ్వడంతో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు.
శివమ్ దూబేను పంపించాల్సింది. లెఫ్టార్మ్ బౌలర్ ఫరీద్ అహ్మద్ వేస్తున్నప్పుడు అతనికే అవకాశం ఇవ్వాల్సింది. లెఫ్టార్మ్ పేస్ను అతను సమర్థ వంతంగా ఆడగలడు. భారత్ 11 పరుగులు చేయడం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా మన ఆటగాళ్లు 6 బంతులు కూడా ఆడలేకపోయారు. ఐదు బంతుల్లోనే రెండో సూపర్ ఓవర్ను ముగించారు.'అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.