న్యూఢిల్లీ: ఐపీఎల్లోనే అత్యంత అభిమాన గణం ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ఫైనల్ చేరిన ఆ జట్టు.. తృటిలో ఛాంపియన్గా నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. ప్రతీ సీజన్లో ఈసాల కప్ నమ్దే అంటూ అభిమానుల్లో ఆశలు రేకిత్తంచడం ఊసురుమనిపించడం ఆ జట్టుకు అలవాటైంది. సమష్టి ప్రదర్శనలు లేకపోవడమే ఆ జట్టు వైఫల్యానికి కారణమైంది.
ముఖ్యంగా విరాట్ కోహ్లీ మినహా మరే భారత బ్యాటర్ కూడా సత్తా చాటలేదు. ఐపీఎల్ అరంగేట్ర సీజన్ నుంచే ఆర్సీబీకి ఆడుతున్న కోహ్లీ.. 16 సీజన్లలో ఏడువేలకు పైగా పరుగులు చేయగా.. మరే భారత బ్యాటర్ కూడా కనీసం వెయ్యి పరుగులు చేయలేకపోయారు. అలా అని వాళ్లు మిగతా జట్లలో ఆడినప్పుడు చేయలేదంటే అదీ కాదు. ఇరత ఫ్రాంచైజీల తరఫున వెయ్యి పరుగులు చేశారు. కానీ ఆర్సీబీ తరఫున మాత్రం కోహ్లీ ఒక్కడే వెయ్యి పరుగులు చేసిన భారత ఆటగాడు.

ఐపీఎల్ అరంగేట్ర సీజన్ నుంచి ఆర్సీబీకి రాహుల్ ద్రావిడ్, పార్థీవ్ పటేల్, రాబిన్ ఊతప్ప, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, దినేశ్ కార్తీక్, దేవదత్ పడిక్కల్, కేదార్ జాదవ్ వంటి ఎందరో స్టార్ ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహించారు. కానీ ఒక్కరు కూడా ఆర్సీబీకి ఆడుతూ వెయ్యి పరుగుల మార్కుకు అందుకోలేదు.
ఆర్సీబీ తరఫున స్టార్ బ్యాటర్ కోహ్లీ 7,044 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ రాహుల్ ద్రవిడే కావడం విశేషం. ఆర్సీబీ తరఫున ద్రవిడ్ 898 పరుగులు చేశాడు. ఆ తర్వాత జాబితాలో పడిక్కల్ (884), పార్థీవ్ పటేల్ (731), దినేశ్ కార్తీక్ (611), మన్దీప్ సింగ్ (597), సౌరభ్ తివారి (487), మయాంక్ అగర్వాల్ (433), మనీష్ పాండే (417)లు ఉన్నారు.

ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఫ్రాంచైజీకి ఆడుతూ వెయ్యి, అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్లు అత్యధికంగా ఉన్న జట్టు కేకేఆర్. గౌతమ్ గంభీర్, రాబిన్ ఊతప్ప, నితీశ్ రాణా, యూసుఫ్ పఠాన్, శుభ్మన్ గిల్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, సౌరవ్ గంగూలీ, మనోజ్ తివారిలు ఈ ఘనతను అందుకున్నారు. ఆ తర్వాత చెన్నై ఉండగా.. ముంబై, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, సన్రైజర్స్ ఫ్రాంచైజీల్లో అత్యధిక మంది వెయ్యి పరుగులు చేసిన భారత ఆటగాళ్లు ఉన్నారు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆకాశ్ చోప్రా ఆర్సీబీపై విమర్శలు గుప్పించాడు. ముంబై ఇండియన్స్తో ఆర్సీబీ ఓటమి అనంతరం ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు. కోహ్లీ మినహా మరే భారత బ్యాటర్పై ఆర్సీబీ ఇన్వెస్ట్ చేయలేదనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నాడు. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన బౌలింగ్ విభాగం.. ముంబైతో మ్యాచ్లో మాత్రం తేలిపోయిందన్నాడు.