టీమిండియా తదుపరి హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ నియామకం దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. రెండో రౌండ్ ఇంటర్వ్యూ అనంతరం గంభీర్ పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే బీసీసీఐ కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. గౌతమ్ గంభీర్తో పాటు డబ్ల్యూవీ రామన్ను బీసీసీఐ నియమించిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ మంగళవారం ఇంటర్వ్యూ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. టీమిండియా నయా హెడ్ కోచ్గా గంభీర్ను ఎంపిక ఖాయమైనట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ రాక.. జట్టులోని సీనియర్ ఆటగాళ్లకు హెచ్చరిక లాంటిదని చెప్పాడు. వారి కెరీర్ దాదాపు ముగిసినట్లేనని అభిప్రాయపడ్డాడు.
'గౌతమ్ గంభీర్ వర్చువల్ ఇంటర్వ్యూను నేను విన్నాను. ఈ పదవి రేసులో అతనే ముందున్నాడు. కోచ్గా అతని పదవి కాలం ఆసక్తికరంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే జట్టులో ఎంతో మార్పు తీసుకువస్తాడని ఆశిస్తున్నా. జట్టులో మార్పులు చేయడం అంత సులువైన పనికాదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ కాంట్రాక్ట్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగే అవకాశం ఉంది. అతని హయాంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027తో పాటు 2025 ఛాంపియన్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలకు జట్టును సిద్దం చేయాలి. ప్రస్తుత స్టార్ ఆటగాళ్లంతా అప్పటికి 40 ఏళ్లకు చేరుకుంటారు. కాబట్టి కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

జట్టులో మార్పులు చేస్తున్నప్పుడు అందుకు తగ్గట్లు ఆటగాళ్ల ప్రదర్శన కూడా ఉండాలి. అందుకోసం కోచ్గా గంభీర్ ప్రతీ ఆటగాడితో కమ్యూనికేట్ కావాల్సి ఉంటుంది. ఏ ఆటగాళ్లను ఉంచుకుంటారు. ఎవరిని వదిలేస్తారో అనే విషయంలో సరైన కారణాలు చెప్పాల్సి ఉంటుంది.'అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు.
ఫార్మాట్కు ఒక జట్టును తయారు చేయాలని గౌతమ్ గంభీర్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కెరీర్లో మరో ఏడాదిలోపు ముగియనుంది.