ఐపీఎల్ 2025 సీజన్లో కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మధ్య చెన్నై వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. గత 17 ఏళ్లుగా చెన్నై గడ్డపై ఆర్సీబీ విజయం సాధించలేదు. 2008లో చివరిసారిగా చెన్నై వేదికగా సీఎస్కేపై గెలుపొందిన ఆర్సీబీ.. తాజా మ్యాచ్లో విజయం సాధించి ఈ రికార్డ్ను తిరగరాయాలనే పట్టుదలతో ఉంది.
గత సీజన్లో సీఎస్కేతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో సంచలన విజయాన్ని అందుకున్న ఆర్సీబీ.. ఆ జట్టును వెనక్కినెట్టి మరీ ప్లే ఆఫ్స్ చేరింది. ఆ సమయంలో ఆర్సీబీ అభిమానులు అతిగా సంబరాలు చేసుకోగా.. చెన్నై ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. దాంతో ఇరు జట్ల మధ్య పోరు భారత్-పాక్ మ్యాచ్లా మారింది. తాజా మ్యాచ్లో గెలిచి.. గత సీజన్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని కసితో ఆర్సీబీ ఉంది.

అయితే ఈ మ్యాచ్కు ముందు ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. చెన్నై సూపర్ కింగ్స్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులో పెద్ద సమస్య ఉందని అభిప్రాయపడ్డాడు. 'ఆర్సీబీతో తలపడే సీఎస్కే జట్టులో ఓ సమస్య ఉంది. రాహుల్ త్రిపాఠిని ఓపెనర్గా ఎందుకు ఆడిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. రాహుల్ త్రిపాఠి ఓపెనర్గా రావడం చూసి నేను ఆశ్చర్యపోయాను. రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేస్తారని భావించాను. కానీ సీఎస్కే రాహుల్ త్రిపాఠిని ఓపెనర్గా ఆడించింది.
ముంబైతో జరిగిన మ్యాచ్లో రాహుల్ త్రిపాఠి విఫలమయ్యాడు. ఈ ఒక్క మ్యాచ్ ప్రదర్శనతో సీఎస్కే అతన్ని తప్పించదు. ఆటగాళ్లు విఫలమైనా అవకాశాలు ఇవ్వడం ఆ జట్టు నైజం. కాబట్టి రాహుల్ త్రిపాఠి మరికొన్ని మ్యాచ్ల్లో ఓపెనర్గా ఆడనున్నాడు. దాంతో రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేస్తాడు. అతను 20 ఓవర్ల పాటు క్రీజులో ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అతను ఔటైతే.. రచిన్ రవీంద్ర ఆ బాధ్యత తీసుకుంటాడనేది వారి ఆలోచన.
అయితే సీఎస్కే మిడిలార్డర్ బలహీనంగా ఉంది. శివమ్ దూబే, దీపక్ హుడా, సామ్ కరణ్ తొలి మ్యాచ్లో విఫలమయ్యారు. సింగిల్ డిజిట్కే వెనుదిరిగారు. ఇది ఆందోళన పరుస్తోంది. వారి వైఫల్యం కారణంగా ముంబైతో చిన్న లక్ష్యాన్ని చేధించేందుకు తడబడ్డారు. యువ స్పిన్నర్ విజ్ఞేష్ పుతుర్ బౌలింగ్ను ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. ఆర్సీబీపై విజయం సాధించాలంటే మిడిలార్డర్లో ఒక్కరైనా రాణించాలి.'అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.