
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమేనని భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు ఇతర జట్ల ఆటతీరుపై ఆధారపడి ఉన్నాయన్నాడు. తాజా ఓటమి తర్వాత ముంబై 10 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు కోల్కతా, పంజాబ్, రాజస్థాన్ జట్లు కూడా పది పాయింట్లతోనే సమానంగా ఉన్నా రన్రేట్ పరంగా కాస్త మెరుగ్గా ఉండటంతో ముంబై కన్నా ముందున్నాయి.
ఈ పరిస్థితుల్లో ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలన్నాడు. 'ముంబై ఇక 16 పాయింట్లకు చేరే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరే అదృష్టం కూడా వారి చేతుల్లో లేదు. ఎందుకంటే వారికి ఇంకా రెండు మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. ఆ రెండింటిలో గెలిచినా 14 పాయింట్లకు మించి వెళ్లదు. మిగతా జట్ల ఫలితాల ఆధారపడాల్సి ఉంటుంది. మరోవైపు ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తృటిలో విజయాన్ని తప్పించుకుంది. గతేడాది ముంబై ఇండియన్స్తో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఓటమిపాలైన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి రోహిత్ జట్టును రెండుసార్లు మట్టికరిపించింది' అని చోప్రా చెప్పుకొచ్చాడు.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 33) మినహా అంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్కు తోడుగా అన్రిచ్ నోర్జ్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 136 పరుగులు చేసి మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. శ్రేయస్ అయ్యర్(33 బంతుల్లో 2 ఫోర్లతో 33 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్(21 బంతుల్లో సిక్స్తో 20 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్నందించారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, జయంత్ యాదవ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నైల్ తలో వికెట్ తీసారు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన అక్షర్ పటేల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.